ఇంగ్లీష్ తప్పినా అర్హత:గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై దుమారం
అమరావతి:గ్రూపు-1 ఉద్యోగ నియామకాల్లో ఎపిపిఎస్సీ చర్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. నియామక పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థులను సైతం ఇంటర్వ్యూలకు పిలవడంపై ఉద్యోగార్థులు మండిపడుతున్నారు.
నిబంధనలకు విరుద్దంగా ఎపిపిఎస్సీ చేసిన ఈ దుస్సాహసం నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రేకెత్తిస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ లో ఒకటైన జనరల్ ఇంగ్లీష్ లో ఫెయిలైన ఎనిమిది మంది అభ్యర్థులు తాజాగా ఎపిపిఎస్సీ చేపట్టిన ఇంటర్వ్యూలకు హాజరుకావడం పెను దుమారాన్నేసృష్టిస్తోంది. అసలు అనర్హులను మౌఖిక పరీక్షలకు ఎందుకు పిలిచారంటూ మిగతా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పైగా తుది మార్కులను అనుసరించి వీరు ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు ఉండటం గమనార్హం.
బుధవారంతో ముగిసిన...ఇంటర్వ్యూలు...
2016 నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ద్వారా అర్హత సాధించిన వారికి మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతినిచ్చారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల అధారంగా 1:2 నిష్పత్తిలో మౌఖిక పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరికి ఇంటర్వ్యూలు గత బుధవారంతో ముగిశాయి. ఈ ఇంటర్వ్యూలు అయిన తరువాత అన్ని కలిపి మార్కులు ప్రకటించారు. అయితే ఇక్కడే ఎపిపిఎస్సీ నిర్వాకం బైటపడింది.
ఎపిపిఎస్సీ...నిర్వాకం
ఎపిపిఎస్సీ ప్రకటించిన తుది ఫలితాలకు సంబంధించి 2,392 మంది అభ్యర్థులకు వచ్చిన మార్కుల జాబితాలను ప్రకటించగా మెయిన్స్ లో ఇంగ్లీష్ లో తప్పిన ఎనిమిది మంది అభ్యర్థుల నెంబర్లు ఇంటర్వ్యూలకు అటెండయి ఆ మార్కులతో కలిపి కనిపించాయి. రూల్స్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ లో 150 మార్కులకు పదో తరగతి స్థాయిలో జరిగే "జనరల్ ఇంగ్లీష్"లో ఓసీ అభ్యర్థులకు 60, బీసీలో 52.5, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరిలోని వారికి 45 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు...ఆ ప్రకారం ఇంగ్లీష్లో అర్హత సాధించని వారు మిగిలిన పరీక్షల పేపర్లు వ్యాల్యుయేషన్ కు అర్హులు కారు. అయితే ఎపిపిఎస్సీ నిబంధనలు తోసిరాజని వీరి మిగతా పేపర్లు దిద్దేసి ఇంటర్వ్యూలకు పిలవడం గమనార్హం.
జనరల్ ఇంగ్లీష్లో...తప్పిన అభ్యర్థులు వీళ్లే
మెయిన్స్ లో సబ్జెక్టుల వారీగా మార్కులు ప్రకటించిన లిస్ట్ లో...సీరియల్ నంబర్ ప్రకారం 14వ అభ్యర్థి(ఓసీ)కి జనరల్ ఇంగ్లీష్లో 57, 23వ నెంబరు అభ్యర్థి(ఓసీ)కి 53, 26వ నెంబరు అభ్యర్థి(బీసీ-ఏ)కి 49.5, 27వ నెంబరు అభ్యర్థి(బీసీ-ఏ)కి 43.5, 39వ అభ్యర్థి (ఓసీ)కి 36, 94వ నెంబరు అభ్యర్థి(బీసీ-బి)కి 46.5, 247వ అభ్యర్థి(ఎస్సీ)కి 44.5, 540వ నెంబరు అభ్యర్థి(ఓసీ)కి 43.5 మార్కులు వచ్చాయి. 75 మార్కులకు జరిగిన ఈ మౌఖిక పరీక్షల్లో వీరికి కనిష్ఠంగా 38, గరిష్ఠంగా 56.5. మార్కులు వచ్చాయి. అంటే వీళ్లంతా ఇంగ్లీష్ లో ఫెయిలైనట్లే లెక్క...అయితే వీరిని ఇంటర్వ్యూలకి పిలవడమే తప్పయితే...ఆ తరువాత వీరి టోటల్ మార్క్స్ చూస్తే....405.5 నుంచి 468 వరకు ఉన్నాయి. అంటే వీరు ఉద్యోగాలు పొందడానికి చేరువలో ఉన్నట్లే లెక్క. ఇప్పుడదే ఉద్యోగార్థుల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఎపిపిఎస్సీ...తీరిగ్గా స్పందించి...తొలగిస్తాం
ఈ వివాదం ఎపిపిఎస్సీ ఛైర్మన్ పిన్నమనేని భాస్కర్ వద్దకు చేరడంతో...ఆయన స్పందించి...జనరల్ ఇంగ్లీష్లో అర్హత సాధించని వారు ఉంటే వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని...ఇంటర్వ్యూలు 1:2 నిషత్తిలో జరిగినందున ప్రత్యేకంగా మళ్లీ ఇంటర్వ్యూలు జరపాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. ఎంపికైన వారి జాబితాను ఇంకా ప్రకటించలేదని, అందువల్ల అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అయితే దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తాము అక్రమాలు జరగాయంటే వారిని జాబితా నుంచి తొలగిస్తామని తీరిగ్గా ఇప్పుడు చెప్పడమేమిటని...చూడకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేసేవారని...ఇదో పెద్ద కుంభకోణం లాగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.