ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి కులంపై వివాదం .. ఆమె ఎస్టీ కాదంటూ కొనసాగుతున్న దుమారం
ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే కుల వివాదం ఇప్పుడు ఏపీలో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పుష్ప శ్రీ వాణి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకుని గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో పుష్ప శ్రీ వాణి ఎస్టీ కాదని ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ ఏ విధంగా కేటాయిస్తారని ఆరోపణలు మొదలయ్యాయి.
గంటాకు టెన్షన్ మొదలైందా? జగన్ గంటాకు షాక్ ఇవ్వనున్నారా ?
పుష్ప శ్రీవాణికి మంత్రివర్గంలో స్థానం కల్పించటంతో మొదలైన ఆరోపణలు
జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపిస్తున్నారు. ఆమె కులానికి సంబంధించినటువంటి కేసు కోర్టు విచారణలో ఉందని, అలాంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ మంత్రివర్గంలోకి ఏవిధంగా తీసుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక అందులోనూ ఉప ముఖ్యమంత్రిగానూ, గిరిజన సంక్షేమ శాఖను కేటాయించటం పైన వారు ఆక్షేపిస్తున్నారు.
ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్ప శ్రీ వాణి కులం వ్యవహారంలో బిజెపి గిరిజన మోర్చా సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి నిబంధన ఉన్నా పుష్ప శ్రీ వాణి 2013 నామినేషన్ సమయంలో సమర్పించారని ఆరోపించారు. ఇక దానిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో పిటీషన్ వేసి ఇప్పటి వరకు కౌంటర్ వేయని ప్రత్యర్థులు .. తాను ఎస్టీనేనని స్పష్టం చేస్తున్న పుష్ప శ్రీ వాణి
పుష్ప శ్రీ వాణి సోదరి రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన అనంతరం ఆమె ఎస్టీ కాదని విచారణ జరిపి పార్వతీపురం ఐటిడిఎ పిఓ నిర్ధారించారని, ఇక సోదరి ఎస్టీ కాకుంటే పుష్ప శ్రీ వాణి ఎస్టీ ఏ విధంగా అవుతుంది అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే పుష్ప శ్రీవాణి మాత్రం తాను ఎస్టీ నేనని తేల్చి చెబుతున్నారు. తన సోదరి విషయంలో తలెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ పుష్ప శ్రీ వాణి తన తండ్రి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుండి తూర్పుగోదావరి జిల్లాకు వలస వెళ్ళారని, ఇక ఈ నేపథ్యంలోనే తన సోదరి ఉద్యోగ విషయంలో నాన్ లోకల్ అంటూ ఆరోపణలు వచ్చాయని, అది కులానికి సంబంధించిన ఆరోపణ కాదని ఆమె పేర్కొన్నారు. తాము కొండ దొర కమ్యూనిటీకి చెందిన వారమని ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ను పర్మినెంట్ సర్టిఫికెట్ గా పరిగణించే నేపథ్యంలోనే తాము ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశామని ఆమె పేర్కొన్నారు.2014లో 19500 పై చిలుకు మెజారిటీతో గెలిచిన పుష్ప శ్రీ వాణి కులం పై అప్పట్లోనే పిటిషన్ వేసిన ప్రత్యర్థులు ఇప్పటివరకు కౌంటర్ వేయకుండా ముఖం చాటేశారని, మళ్ళీ ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు .
పుష్ప శ్రీవాణి ఎస్టీనే కాదంటున్న గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స
ఇక తాజాగా మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించడంతో మరోమారు ఆమె కులం పై వివాదం చెలరేగింది. ఇక ఈ నేపథ్యంలోనే అరకులో మీడియాతో మాట్లాడిన గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స పుష్ప శ్రీ వాణి సోదరి ఉద్యోగం పోగొట్టుకోవడానికి కారణం ఆమె ఎస్టీ కాదని , అలాంటప్పుడు శ్రీవాణి ఎస్టీ ఎలా అవుతుంది అంటూ ఆరోపణలు గుప్పించారు. ఆమె తొలిసారి గెలిచినప్పుడే కోర్టులో కేసు దాఖలైందని పేర్కొన్న అప్పలనర్స అది విచారణలో ఉండగానే రెండోసారి సైతం ఆమెకు టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో ఆమెకు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.