వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి డబ్బుపై దుమారం...మా ఖాతాల్లో ఎందుకేశారు?:సంఘమిత్రల ఆగ్రహం
Recommended Video
చిత్తూరు:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి ఖాతా నుంచి డబ్బులు జమ కావడంపై పెను దుమారం రేగుతోంది.
తమ అనుమతి లేకుండా తమ ఖాతాల్లోకి డబ్బులు ఎవరు వేయమన్నారంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సంఘమిత్రలు ఆందోళనకు దిగారు. మరోవైపు సంఘమిత్రల ఖాతాల్లో డబ్బు జమపై ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి లక్ష్మి స్పందిస్తూ..."రాత్రింబవళ్లు ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తూ కష్టాలను ఎదుర్కొంటున్న సాటి సంఘమిత్రలకు సాయం చేస్తే తప్పా?"...అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి డబ్బు జమ వ్యవహారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పీకల్లోతు కష్టాలలోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని రాష్ట్రప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణించడంతో పాటు దీన్ని విచారణ నిమిత్తం ఏసీబీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో వెలుగు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందోనని కలత పడుతున్నారు. ఇందులో తమ తప్పేమీ లేకపోయినా తాము దెబ్బతినాల్సి వస్తుందేమోనని మథనపడుతున్నారు.
అసలేం జరిగిందంటే...తొలుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అకౌంట్ నుంచి ఆయన సతీమణి లక్ష్మీ ఖాతాకు కొంత డబ్బు బదిలీ అయింది. తర్వాత ఆమె ఖాతా నుంచి వారికి ఈ డబ్బు వెళ్లింది. ఇలా ఆమె అకౌంట్ నుంచి ఈ నెల 4 వ తేదీన ఒకేరోజు సుమారు 175 మంది వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి ఈ డబ్బు బదిలీ అయింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల చొప్పున జమచేశారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగానైనా అధికారులకు తెలియడంతో వారు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు.
ఇప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకూ ప్రతి నెలా ఇలాగే రూ.2 వేల చొప్పున నగదు డిపాజిట్ చేస్తామని ఎమ్మెల్యే మనుషులు తమకు చెప్పారని కొందరు వెలుగు అసిస్టెంట్లు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు వెల్లడించారు. అలాగే రాత్రిపూట గ్రామాల్లో వయోజన విద్య బోధించే సాక్షర భారత్ కార్యకర్తలకు కూడా తమ మాదిరిగానే నెలకు రూ.1,500 చొప్పున వారి ఖాతాలకు పంపుతామని ఎమ్మెల్యే వర్గీయులు సమాచారం ఇచ్చారని ఇంకొందరు తెలిపారు. ఎన్నికలు ముగిసేవరకూ వారికి కూడా నెలనెలా ఖాతాల్లో జమచేస్తామన్నారని చెప్పారు
అయితే ఈ వ్యవహారంపై విచరణ జరగడం ఖాయంగా కనిపిస్తుండటంతో డబ్బు జమైన సంఘాల్లో తిరుపతి రూరల్కు చెందిన సంఘమిత్రలు తమ కార్యాలయం ముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఆ డబ్బులు తీసుకునే ప్రసక్తే లేదని...వెనక్కి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. అయితే వెలుగు సిబ్బంది ఖాతాల్లో తాను డబ్బు జమ చేసింది నిజమేనని ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి లక్ష్మి అంగీకరించారు. తాను ఎందుకు అలా చేశానో ఒక ప్రకటనలో వివరణ సైతం ఇచ్చారు. సంఘమిత్రల కష్టాలను చూసి సాయం చేద్దామని వారి ఖాతాల్లో డబ్బులు జమచేశామన్నారు.
"రాత్రింబవళ్లు ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తూ కష్టాలను ఎదుర్కొంటున్న సాటి సంఘమిత్రలకు సాయం చేస్తే తప్పా?"...అని ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి లక్ష్మి ఆ ప్రకటనలో ప్రశ్నించారు.ఒకరోజు తమ ఇంటికి వచ్చిన సంఘమిత్రలు...20 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం చెప్పే 17 రకాల పనులను చేస్తూనే ఉన్నామని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా కాదు కదా...కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
వైసీపీ
అధికారంలోకి
వస్తే
రూ.10
వేలకు
తగ్గకుండా
సంఘమిత్రలకు
జీతం
ఇస్తామని
జగన్
హామీ
ఇవ్వడంతో
ఎమ్మెల్యేకి
కృతజ్ఞతలు
చెప్పేందుకు
వచ్చారన్నారు.
వారి
కష్టాలను
చూసి
బాధ
పడి
ఎమ్మెల్యే
భార్యగా
కొద్దిపాటి
సాయం
చేద్దామని
ఒక్కో
సంఘమిత్ర
ఖాతాలో
రూ.2
వేలు
తన
ఖాతా
నుంచి
జమ
చేసిన
మాట
వాస్తవమేనని
ఆమె
అంగీకరించారు.
మూడున్నర
లక్షల
రూపాయల
సాయానికి
ఏసీబీ
విచారణ
అవసరమా
అని
ఆమె
ప్రశ్నించారు.
మరోవైపు ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుండడంతో వెలుగు సిబ్బంది అప్రమత్తమై అత్యవసర సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఎవరైనా తమ ఖాతాల్లోకి డబ్బులు వేయడాన్ని అనుమతించరాదని, వేసినా తీసుకోరాదని నిర్ణయించుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వారిని తమ సంఘాల నుంచి తొలగించాలని కూడా తీర్మానాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా యర్రావారి పాలెం, పాకాల మండలాల్లో వెలుగు సిబ్బంది సమావేశాలు జరుగుతున్నాయి.