గోదావరి తీరంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి నదిలో రెండు వంతెనల మధ్య ఏర్పాటు చేయతలపెట్టిన ఎన్టీఆర్ విగ్రహం వివాదాస్పదమవుతోంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని గోదావరిలో నెలకొల్పాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం వచ్చింది.
విగ్రహం నెలకొల్పాలని యోచిస్తున్న ప్రదేశం సరైనది కాదనే వాదన వినిపిస్తోంది. కాగా, తాజాగా శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పాలన్న అంశం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ అంశంపై శుక్రవారం రాజమండ్రిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. టిడిపి, బిజెపి మినహా మిగిలిన పలు రాజకీయ పక్షాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
గోదావరిలో రెండు వంతెనల మధ్య విగ్రహం నెలకొల్పడం ఏమాత్రం సరికాదని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. అందులోనూ హిందువులు దేవుడిగా పూజించే శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ప్రజల మనోభావాలను దెబ్బతీయద్దని సూచించారు. ఎన్టీఆర్ మహానటుడే గాని అవతార పురుషుడు కాదని స్పష్టం చేశారు. టిడిపి నాయకులకు అభిమానముంటే ఆ రూపంలో విగ్రహాలను వారి ఇళ్లల్లో పెట్టుకుని పూజించుకోవాలని సలహా ఇచ్చారు.
ఆయన పుట్టిన కృష్ణా జిల్లాలో పెట్టుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడి అవతారంలో ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ తప్పుపట్టిందని అఖిల పక్ష నేతలు గుర్తుచేశారు. మహానటుడైన ఎన్టీఆర్ను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని హితవు పలికారు. ప్రభుత్వం మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఒక మతాన్ని ప్రోత్సహించేలా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును తాము వ్యతిరేకించామని సమావేశానికి హాజరైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్పొరేటర్లు చెప్పారు.