టిటిడిలో "హైందవేతరుల" చిచ్చు... ఉద్యోగులకు టెర్మినేషన్ నోటీసుల జారీపై వివాదం...
తిరుమల:టిటిడిలో హైందవేతరులు అంటూ కొంతమంది ఉద్యోగులకు టెర్మినేషన్ నోటీసులు జారీ చెయ్యడంపై వివాదం రాజుకుంటోంది. ఇలా నోటీసులు జారీ చెయ్యడం ఏ రకంగా చూసినా తప్పేనని ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికారుల తీరును టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాలతో పాటు ట్రేడ్ యూనియన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
టిటిడిలో దశాబ్దాల తరబడి శ్రీవారికి సేవలందించిన 45 మంది ఉద్యోగులకు హైందవేతరులంటూ టెర్మినేషన్ నోటీసులు ఇవ్వడంపై వివాదం రేగుతోంది. అధికారుల తీరును తప్పుబట్టిన టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరో అయోధ్యలా మార్చొద్దంటూ హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ జిల్లా జడ్జి గురప్ప అధ్యక్షులుగా, టిటిడి స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ గౌరవాధ్యక్షులు కందారపు మురళి కన్వీనర్గా టిటిడి ఉద్యోగుల పరిరక్షణ వేదిక ఏర్పాటైంది.
ఏళ్లతరబడి సేవ చేసిన ఉద్యోగులను కేవలం మతం పేరుతో తొలగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని టిటిడి ఉద్యోగుల పరిరక్షణ వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు చట్టాన్ని,కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించడంపై ఉద్యమానికి సిద్ధమని ఆదివారం ప్రకటించింది. రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా టిటిడి వ్యవహరిస్తున్న తీరును మానవతా, లౌకిక వాదులు తీవ్రంగా ఖండిస్తుండటం గమనార్హం. తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధి, కైంకర్య సేవల్లోనూ అనాదిగా ముస్లిం, మైనార్టీలకూ భాగస్వామ్యముందని చరిత్ర ఆధారాలతో సహా స్పష్టం చేస్తోంది.
ముస్లిం వనిత బీబీనాంచారిని వివాహమాడి పరమతసహనానికి శ్రీకారం చుట్టిన అసలు సిసలు సెక్యులర్ దేవుడు తిరుమల వెంకటేశ్వరస్వామి అని చరిత్ర చెబుతోందని, అయితే అలాంటి చోట సంఫ్పరివారం మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. "నేటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో ముస్లిం వనిత బీబీనాంచారి విగ్రహానికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆమెను శ్రీనివాసుని భార్యగానే పరిగణిస్తున్నారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న' బ్యాక్ సవారీ' ముస్లిం మత ఆచార ప్రకారమే సాగుతోంది. స్వామి వారికి నైవేద్యం సమర్పించే ' మన్రో గంగాళం' బ్రిటీష్ వారి కాలంలో కడప కలెక్టర్గా ఉన్న మన్రో అనే క్రైస్తవ భక్తుడు సమర్పించినదేనని, కావున హైందవేతరులు అనే సిద్దాంతం ఇక్కడ వర్తించదంటున్నారు.
పరమత సహనాన్ని పాటించిన శ్రీవారి చెంతనే హైందవేతరులు అంటూ 45 మంది ఉద్యోగుల్ని తొలగించడం రాజ్యాంగ విరుద్దమని టిటిడి ఉద్యోగుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు, రిటైర్డ్ జడ్జి పెనుమూరు గురప్ప, కన్వీనర్ కందారపు మురళిలు స్పష్టం చేశారు. ధర్మక్షేత్రంలో న్యాయం కోసం ఉద్యోగుల తరపున లౌకిక, మానవతావాదులు, ప్రజాసంఘాలతో కలిసి టిటిడి ఉద్యమిస్తామని హెచ్చరించారు.