ఎస్కే యూనివర్సిటీలో ఫలితాల తారుమారు... ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్
అనంతపురం: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీలో డిగ్రీ ఫలితాల తారుమారు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ తారుమారుతో సంబంధం ఉందనే కారణంతో ఐదుగురు ఉద్యోగులపై విశ్వవిద్యాలయం వేటు వేసింది.
అలాగే మరికొంతమందికి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని, విచారణలో వారి పాత్ర కూడా తెలిసాక చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ ఉన్నతాథికారులు చెబుతున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాల తప్పిదాలపై బుధవారం నిరసనలు హోరెత్తిన నేపథ్యంలో యూనివర్శిటీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు...వివరాల్లోకి వెళితే...
ఫలితాలు రెండు సార్లు...తారుమారు
శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం డిగ్రీ పరీక్షా ఫలితాలను తొలుత విడుదల చేయగా...అందులో కొంత మంది విద్యార్థులు ఫలితాల్లో తప్పులు ఏర్పడ్డాయని సిబ్బంది మరోసారి ఫలితాలు వెల్లడించడం వివాదానికి దారితీసింది. తొలిసారి రిజల్ట్స్ ప్రకటించినప్పుడు పాసైన విద్యార్థులు రెండవసారి విడుదల చేసిన ఫలితాల్లో ఫెయిల్ కాగా...కొందరు ఫెయిలైన వారు పాసయ్యారు.
విద్యార్థుల ఆందోళన...ముట్టడి
దీంతో ఒకసారి విడుదల చేసిన ఫలితాల్లో పాసైన విద్యార్థులు మరోసారి ఎలా ఫెయిల్ అవుతారంటూ డిగ్రీ విద్యార్థులు ఎస్ కే వర్సిటీకి చేరుకొని పరీక్షల విభాగాన్ని ముట్టడించారు. మా భవిష్యత్తుతో ఆడుకుంటారా అంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు పరీక్షల విభాగం లోపలి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరీక్ష విభాగం తలుపులను మూపి వేయగా, విద్యార్థులు ఆగ్రహంతో తలుపులు తెరవాలంటూ చేతులతో కిటికీ అద్దాలపై బాదడంతో అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కొంత మంది విద్యార్థులు గాయపడ్డారు.
చర్యల కోసం...విద్యార్థుల డిమాండ్
దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం గా మారకుండా పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థులను బలవంతంగా అక్కడనుంచి పంపించివేశారు. మరోవైపు ఎస్కే యూనివర్శిటీలోనే కాకుండా కదిరి, కల్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో సైతం తమకు న్యాయం చేయాలంటూ డిగ్రీ విద్యార్థులు రోడ్డు పై బైఠాయించారు. ఉద్దేశ్యపూర్వకంగానో...ఏ కారణం చేతనైనా ఇలా ఫలితాలు తారుమారు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్న యూనివర్సిటీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐదుగురిపై వేటు...
విద్యార్థుల నిరసనలు హోరెత్తుతుండటంతో యూనివర్శిటీలో ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఉపకులపతి రాజగోపాల్ తెలిపారు. పరీక్షల విభాగంలో విద్యార్థుల డిగ్రీ ఫలితాలను తారుమారు చేసినట్లు దర్యాప్తులో తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రాథమికంగా విచారించి ఐదుగురిని గుర్తించామని మరికొంత మంది ఈ కుట్రలో ఉన్నట్లు తెలిసిందన్నారు. విచారణలో ఈ కుట్రకు పాల్పడిన ఉద్యోగులను గుర్తించి వారిపైనా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
వేటు సరికాదు...ఉద్యోగుల ఆందోళన
ఇదిలావుండగా మరోవైపు పరీక్షల విభాగంలో ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం సమంజసం కాదని యూనివర్శిటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ తప్పిదం వల్ల రిజల్ట్స్ తారుమారు అయితే అందుకు ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేయడం భావ్యం కాదన్నారు. ఈ క్రమంలో పరీక్షల విభాగంలో జరిగిన తప్పిదాలపై విచారణ చేయడానికి వచ్చిన త్రిసభ్య కమిటీతో యూనివర్శిటీ ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు.