చిత్తూరు జిల్లాలో మహిళ వివస్త్ర, దాడి ఘటనలో నిందితుల అరెస్ట్...కారణం అదేనా?
Recommended Video
చిత్తూరు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా గుంజార్లపల్లి మహిళ వివస్త్ర ఘటనలో నిందితులను రాళ్లబూదుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక మహిళను కొందరు నడి రోడ్డుపై వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లాలోని గుంజార్లపల్లికి చెందిన ఉమ, రమేష్ భార్యభర్తలు.అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తితో ఉమకు వివాహేతర సంబంధం ఉందని శ్రీనివాసులు భార్య భాగ్యలక్ష్మికి అనుమానం.ఈ నేపథ్యంలో ఉమ, ఆమె రమేష్ పై భాగ్యలక్ష్మి, బంధువులు కౌసల్య, పద్మమ్మలు దారుణంగా దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఉమను నడిరోడ్డుపై వివస్త్రను చేసి మరీ కొట్టారు. మరోవైపు ఈ ఘటనలో రాజకీయ కోణాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ సంఘటన వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, కేవలం వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని అంటున్నారు.
మరోవైపు సాక్షాత్తూ సిఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఇంత దారుణంగా మహిళను వివస్త్రను చేసి కొట్టడం కలకలం రేపింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మహిళను ఘోరంగా అవమానించి, చావబాదిన వారిని అరెస్టు చేయాలని సిఐటియు, ఐద్వా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తిరుపతి మధురానగర్లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ఆర్.లక్ష్మి, కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో టిడిపి మద్దతుదారులు మహిళను వివస్త్రను చేయడం, ఆమె భర్తను చితకబాదడం దారుణమన్నారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే దాడి ఘటనపై వైసిపి స్పందించిది. హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కుప్పంలో టీడీపీ నేతలు దాష్టీకం చేస్తున్నారని విమర్శించారు. గుంజార్లపల్లిలో ఓ మహిళను వివస్త్రను చేసి కొట్టడమే కాకుండా ఆ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టడం సిగ్గుచేటు అని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.