విద్యార్ధిని కొట్టేంచేందుకు రౌడీలను తీసుకొచ్చిన వంటమనిషి
హైదరాబాద్: ఓ విద్యార్ధిపై వంట మనిషి దాడి చేసేందుకు రౌడీలు తీసుకొచ్చిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బీసీ వసతి గృహంలో జరిగిన ఈ సంఘటన విద్యార్ధులను భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బీసీ వసతి గృహంలో ఓ విద్యార్ధికి, వంట మనిషికి చిన్నపాటి గొడన జరిగింది. ఈ క్రమంలో విద్యార్థిని కొట్టడానికి రౌడీలను తీసుకొని వంటమనిషి వసతి గృహానికి వచ్చాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్ధులు గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు.
వెంటనే ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారమందించారు. పోలీసుల సరైన సమయంలో అక్కడికి చేరుకోవడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు. విద్యార్ధుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు వంటమనిషిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్ధిని చితకబాదిన వాచ్మెన్
హాస్టల్లో విద్యార్ధిని వాచ్మెన్ చితకబాది పరారైన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం గుంటుపల్లిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
విద్యార్ధుల చెప్పిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మంగళవారం 8 నుంచి 9 గంటల మధ్య హాస్టల్లో కరెంట్ పోయింది. ఈ సమయంలో కొందరు విద్యార్ధులు బిగ్గరగా కేకలు వేశారు. 7వ తరగతి చదువుతున్న రాము గట్టిగా అరిచాడని వాచ్మెన్ రవికుమార్ భావించాడు.
ఆ క్రమంలో కర్రతో రామును తీవ్రంగా కొట్టాడు. దీంతో అతడు గాయపడ్డాడు. అనంతరం భయంతో రవికుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. తోటి విద్యార్ధులు బాధితుడిని స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.