కలకలం:గుంటూరులో జంతు కళేబరాల నుంచి నూనె...తయారీ కేంద్రం సీజ్
గుంటూరు:డబ్బు సంపాదన కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు...ఎంత నీచానికైనా దిగజారుతున్నారు కొందరు వ్యాపారులు...రూపాయి లాభం వస్తుందంటే చాలు ఎదుటి వాడి ప్రాణాలు పణంగా పెట్టయినా తాము సొమ్ము చేసుకుందామనుకునే విపరీత ధోరణి వీరికే సొంతం.
ఇదే కోవలో జంతువుల కళేబరాల కొవ్వుని కరిగించి దాని నుంచి వచ్చే నూనెతో వ్యాపారాలు సాగిస్తున్నారు కొందరు అక్రమ వ్యాపారులు. అంతేకాదు ఈ ఆయిల్స్ ను ఏపీనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. ఆదివారం రాత్రి గుంటూరులో ఇలాంటి తయారీ కేంద్రం గురించి సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి భారీగా ఈ ప్రమాదకర సరకును స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు నగరం పొత్తూరివారితోట మూడో వీధికి చెందిన మహ్మద్ ఖలీల్ 5వ వీధిలో ఓ దుకాణ సముదాయాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతడు రహస్యంగా జంతువుల కళేబరాలను సేకరించి ఆ తరువాత వాటిలోని కొవ్వుని కరిగించి దాని నుంచి వచ్చే నూనెతో వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ సమాచారం ఆదివారం సాయంత్రం కొత్తపేట ఇన్స్పెక్టర్ కె.వంశీధర్కు రావడంతో ఆయన తన సిబ్బందితో ఆ గౌడౌన్ పై దాడులు చేశారు.
ఈ సందర్భంగా అందులో భద్రపరిచిన 450 డబ్బాలను పోలీసులు గుర్తించారు. ఇవి ఒక్కో డబ్బా 15 కిలోలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాటిని ఎపిలోని టిఫిన్ సెంటర్లు, హోటళ్లతో పాటు పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నూనెను వివిధ రకాల ఆహార పదార్థాల్లో వినియోగిస్తారని పోలీసులకు తెలిసింది.
పోలీసులు వెంటనే ఆ నూనె డబ్బాలను సీజ్ చేశారు. అనంతరం వీటిని ఫుడ్ కంట్రోల్ అధికారులకు ని అప్పగిస్తామని ఇన్స్పెక్టర్ వంశీధర్ చెప్పారు. గుంటూరు పరిధిలో ఇలాంటివి మరి కొన్ని కేంద్రాలు ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి పరిశ్రమల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించనున్నట్లు పోలీసులు తెలిపారు.