రంగంలోకి బాబు: పార్లమెంటరీ నేతలతో చర్చలు, బిజెపికి చెక్ పెట్టే ప్లాన్
Recommended Video
అమరావతి: బిజెపి, వైసీపీ, జనసేన పార్టీలది ఒక్కటే ఎజెండా అని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం విషయంలో ఇతర పార్టీల నేతలతో సమన్వయం చేసుకోవాలని టిడిపి ఎంపీలకు బాబు సూచించారు.
మంగళవారం నాడు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో టెటికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్ లో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.
పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాసం విషయంలో ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. అవిశ్వాస తీర్మానానికి సహకరించేలా అన్ని పార్టీలను ఒప్పించాలని బాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు.
అన్ని పార్టీలతో మాట్లాడుతా
పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాసం విషయంలో సహకరించాలని అన్ని పార్టీల ఎంపీలతో మాట్లాడనున్నట్టు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు చెప్పారు. పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాసం విషయంలో పార్లమెంట్లో పలు పార్టీల పక్ష నేతలతో తాను స్వయంగా మాట్లాడి సహకరించాలని కోరనున్నట్టు బాబు చెప్పారు. కేంద్రంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందనే విషయమై ఆయా పార్టీల ఎంపీలకు వివరించనునన్నట్టు బాబు పార్టీ ఎంపీలకు చెప్పారు.
ఇతర పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవాలి
పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం విషయంలో ఇతర పార్టీల నేతలతో కూడ సమన్వయం చేసుకోవాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఆయా పార్టీలతో కూడ అవిశ్వాసంపై నోటీసులు ఇప్పించాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. అవిశ్వాసంపై ఆయా పార్టీల నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ వ్యూహలను రూపొందించుకోవాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు.
టిడిపిపై తప్పుడు ప్రచారం
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలపై కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగా టిడిపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబునాయుడు చెప్పారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే కొన్ని పార్టీలు టిడిపిపై బురద చల్లుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ, జనసేన, బిజెపిలపై బాబు విమర్శలు గుప్పించారు.
ఆ పార్టీలన్నీ ఒక్కటే
బిజెపి, వైసీపీ, జనసేనల దారి ఒక్కటేనని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాసాన్ని రెండు పార్టీలు ఏ రకంగా అడ్డుకొన్నాయో ప్రజలంతా గమనించారని బాబు చెప్పారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు. సమయం, సందర్భాన్ని బట్టి వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని బాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
కుట్రలు కొత్త కాదు
కుట్రలను ఎదుర్కోవడంలో తెలుగు ప్రజలు రాటు దేలారు. కుట్రలను ఎదుర్కోవడం తెలుగువారికి కొత్తకాదని చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో పోరాటం చేస్తోంటే యుద్దం చేస్తున్నారని కేంద్రం ఆరోపించడం సరికాదన్నారు.