తుఫాన్ వల్ల భేటీ వాయిదా: డిగ్గీ, ఊరుకున్నారేం: దానం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం పైన ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశం తుఫాను వల్ల వాయిదా పడిందని రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
అదే సమయంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా స్పందించారు. పరేఖ్ ఏమైనా చెప్పాలనుకుంటే సిబిఐ ఎదుట చెప్పాలన్నారు. బొగ్గు గనుల కేటాయింపు విషయంలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ విమర్శలు అర్థరహితమన్నారు. ఎన్డీయే అనుసరించిన విధానాలనే యూపిఏ అనుసరించిందన్నారు.
కాగా, బొగ్గు కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాము దోషులమైతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా దోషేనన్నారు. ప్రధాని పైన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఎలా ఊరుకున్నారు?: దానం
తిరుపతి ఉద్యమ ఘటన విషయమై ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మంత్రి దానం నాగేందర్ హైదరాబాదులో ఆరోపించారు. గతంలో కాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని మూడు నెలలు జైల్లో పెట్టారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమాధి కడితే ఎలా ఊరుకున్నారని ప్రశ్నించారు. సుమోటోగా స్వీకరించాలని దానం నాగేందర్ డిజిపికి ఫిర్యాదు చేశారు.