'రత్నాచల్' దగ్ధం, 30 కోట్ల నష్టం: ముద్రగడ 'ఆలస్యం' వెనుక! 70 కేసులు
విజయవాడ: రెండు రోజుల క్రితం ఎంతో ఉత్సాహంగా విశాఖ, ఇతర స్టేషన్ల నుంచి రత్నాచల్ ఎక్స్ప్రెస్లో విజయవాడ వైపు బయల్దేరిన ప్రయాణికులకు ఆదివారం తుని స్టేషన్ సమీపంలో ఊహించని సంఘటన భయాందోళనలకు గురి చేసింది.
23 బోగీలలో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు ఉండగా రైలుపై ఆందోళనకారుల దాడితో అంతా భయపడ్డారు. అకస్మాత్తుగా ఉద్యమకారులు రైలుపై పడటంతో ఓ నిండు గర్భిణి బ్యాగ్ చేతబట్టి 20 అడుగుల గట్టు నుంచి కంకరరాళ్ల మీదుగా కిందకు జారుకుని ప్రాణాలు కాపాడుకుంది.
మరో మహిళ చంటిబిడ్డను చంకన పెట్టుకుని మరో చేతిలో బ్యాగుతో ఆర్తనాదాలతో రైలు నుంచి తప్పించుకుంది. అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్న వృద్ధ దంపతులు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
రైలు నుంచి బయటపడ్డాకా ఓ పక్క ఆందోళనకారులు తగలబెట్టిన రత్నాచల్ ఎక్స్ప్రెస్, మరోవైపు ఎటువైపు వెళ్లాలో తెలియని ఆందోళనతో ప్రయాణికులు తల్లడిల్లారు. జరిగిన సంఘటన ఏమిటో అర్థం కాక చిన్నారులు భయపడిపోయారు.
విజయవాడ, విశాఖపట్నం మధ్య అత్యంత ప్రాచుర్యం కలిగిన రత్నాచల్ ఎక్స్ప్రెస్కు శనివారమే రూ.15 కోట్ల విలువైన కొత్త ఇంజిన్ను అమర్చినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రైలు దహనం నేపథ్యంలో రైల్వేశాఖకు సుమారు రూ.30 కోట్ల నష్టం వాటిల్లి ఉండవచ్చని భావిస్తున్నారు.
తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసమైంది. రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని జనవరి 6నే ప్రారంభించారు. ప్రారంభమై మూడు వారాలైనా గడవక ముందే ఆదివారం ఆందోళనకారుల దాడికి గురైంది. వాహనాలు, దస్త్రాలు, ఫర్నిచర్ అంతా అగ్నికి ఆహుతైంది. రాళ్లు రువ్వడం, కర్రలతో దాడులు చేయడంతో పదుల సంఖ్యలో సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని వసతి గృహం కూడా ధ్వంసమైంది.
రైలు, రాస్తారోకోలకు రెచ్చగొట్టడం, రైలును తగలబెట్టడం, పోలీస్ స్టేషన్లపై దాడులు, వాహనాలకు నిప్పటించడం, పోలీసు, మీడియా సిబ్బందిపై దాడులకు పాల్పడడంపై పలు సెక్షన్ల కింద ముద్రగడ పద్మనాభం సహా పలువురు కీలక నేతలపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. సోమవారం 70 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కాపు రిజర్వేషన్ సాధన పోరాటంలో చివరి అస్త్రంగా ముద్రగడ సతీసమేతంగా ఆమరణ దీక్షను ఈ నెల 5న ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత సోమవారం సాయంత్రం నుంచే దీక్ష చేయాలని అనుకున్నా తేదీ మార్చారు. గతంలో తన ఉద్యమ ఫలితంగా వచ్చిన జీవో 30పై ముద్రగడ సోమవారం తన నివాసంలో మరోసారి న్యాయనిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. ఈ కారణంగానే వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.