ఎట్టకేలకు!...కాల్మనీ లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్...రెండేళ్ల తరువాత...అన్నీ అనుమానాలే
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ కాల్మనీ లైంగిక వేధింపుల కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు నమోదై రెండేళ్లు దాటిన తరువాత శనివారం పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిసింది.
2015 డిసెంబర్ 11న నమోదైన కేసుకు సంబంధించి అప్పటి ఎఫ్ఐఆర్లో నమోదైన ఏడుగురు నిందితులు యలమంచిలి శ్రీరామమూర్తి, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీను, సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్లనే ప్రస్తుత ఛార్జిషీట్లో చూపారు. 90 రోజుల్లో ఛార్జిషీట్ నమోదు చేయాల్సి ఉన్నా రెండేళ్లు దర్యాప్తు చేసిన అనంతరం తూతూ మంత్రంగా ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు అందులో సరైన సైంటిఫిక్ ఆధారాల్ని కోర్టులో ప్రవేశ పెట్టలేదనే విమర్శలొస్తున్నాయి.
సాక్షుల విచారణ...ఆరోపణలు
ఛార్జిషీట్లో 20 మందిని సాక్షులుగా విచారించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే సాక్షులందరూ నిందితులకు పరిచయస్తులు, బాగా తెలిసిన వారేనని మరోపక్క బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అలాగే పోలీసులు బాధితుల వాంగ్మూలం నమోదు చేసినా అందుకు తగ్గ సైంటిఫిక్ ఆధారాల్ని ఛార్జిషీట్లో జతచెయ్యకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ఒత్తిడితోనే నిందితులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
నిందితులకు...రాజకీయ నేతల అండ...
ఈ కేసులో కీలక నిందితులకు విజయవాడ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ పూర్తి మద్ధతు ఉందని చెబుతున్నారు. కాల్ మనీ కేసు నమోదైన సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై కొందరు బాధితులు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. నిందితులతో కలిసి ఎమ్మెల్యే బోడే చేసిన విదేశీ పర్యటనల ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బహిర్గతమయ్యాయి. ఇంత జరిగినా కనీసం ఎమ్మెల్యేను విచారించడంగానీ, ఛార్జిషీట్లో అతని పేరును చేర్చడంగానీ చేయలేదు. పైగా ఈ కేసులో ప్రధాన నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేశారు.
కేసుల నమోదు...ఈ సెక్షన్ల కింద...నో రౌడీషీట్
2015 డిసెంబర్ 11న విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన 694/2015 కాల్మనీ లైంగిక వేధింపుల కేసులో ఏడుగురు నిందితులపై 354, 367, 376, 386, 387, 480, 120బి, ఐపిసి 34 సెక్షన్లను నమోదు చేశారు. ఎ1 యలమంచిలి శ్రీరామచంద్రమూర్తిపై 11 కేసులు, విద్యుత్శాఖ డిఈ ఎ4 సత్యానందంపై 4 కేసులు నమోదయ్యాయి. చిన్న చిన్న నేరాలు చేసే వారిపైన కూడా రౌడీ షీట్, కేడీ షీట్ ప్రారంభించే పోలీసులు ప్రధాన నిందితులపై పదుల సంఖ్యలో కేసులున్నా ఎవరిపైనా రౌడీ షీట్ ఓపెన్ చేయక పోవడం గమనార్హం.
కేసులు నీరుగార్చేందుకేనా...కాలయాపన...
కాల్ మనీ కింద కేసు నమోదు తరువాత నిందితుల ఇళ్లపై విజయవాడ టాస్క్ఫోర్స్ సిబ్బంది జరిపిన దాడిలో వందల సంఖ్యలో ప్రాంశరీ నోట్లు, ఖాళీ చెక్బుక్కులు, ఎటిఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారపార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు సంచలనాత్మక కేసును నీరుగార్చేందుకు కాలయాపన చేస్తున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికార నేతల అండతో బెయిల్పై బయటకు వచ్చిన ప్రధాన నిందితులు మళ్లా అదే కాల్మనీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ప్రధాన కేసుకు సంబంధించి బాధితులను నయానో, భయానో భయపెట్టి రాజీ చేసుకునే దిశగా నిందితులు పలు ఒత్తిళ్లు తెస్తున్నారని అంటున్నారు.
అసెంబ్లీలో చర్చ జరిగినా...సరైన చర్యలు లేవు...
లైంగిక వేధింపుల కేసులో అధికార పార్టీ నేతల హస్తం ఉందని బాధితులు బహిరంగంగా ఆరోపించడంతో అసెంబ్లీలోనూ ఈ కేసు విషయం చర్చానీయాంశమైంది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. పోలీసుల వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టాయి. ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చెయ్యాలని,నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ సందర్భంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. అయితే పోలీసులు కాలాయాపన చేయడంతో సహజంగానే అందరిలోనూ నిరాసక్తత వచ్చేసింది. విజయవాడలో మొదటి కేసు నమోదైన తరువాత ఈ కాల్ మనీకి సంబంధించి అటు విజయవాడలోను, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఫిర్యాదులు, వందల కేసులు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం వీటిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో నిందితుల్లో ఎక్కువ మంది మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తుండటం గమనార్హం.
బాధితులకు అన్యాయం...శిక్షపడాల్సిందే...
కాల్ మనీ కేసులో పోలీసుల వ్యవహారశైలితో బాధితులకు అన్యాయం జరుగుతోందని, ఛార్జిషీట్ను ఆలస్యంగా దాఖలు చేయడమే కాకుండా సరైన ఆధారాలు సమర్పించకపోతే...కాల్మనీ లైంగిక వేధింపుల వంటి కీలక కేసులు నిలబడవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ జెవిఎస్హెచ్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. కాల్ మనీ కేసు విషయమై మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ...కాల్మనీ లైంగిక వేధింపుల కేసులో నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా శిక్ష పడాల్సిందేనని, ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులూ పారదర్శంగా వ్యవహరించాలని సూచించారు. బాధితులు ఎటువంటి భయం లేకుండా సాక్షాలను బయటపెట్టాలన్నారు. ఎగ్గొట్టే వారికీ, పెద్దలకు మాత్రమే బ్యాంకులు రుణాలిస్తున్నాయని విమర్శించారు. అవసరమున్న వారికి బ్యాంకులు రుణాలిచ్చి సహాయం చేస్తే ఇటువంటి ఘటనలకు ఆస్కారం ఉండదని నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు.