తనిష్క్ కిరణ్ పనే, నటించి.. అన్నీ పక్కా ప్లాన్తో: సిపి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తనిష్క్ జ్యువెల్లర్స్లో దొంగతనానికి పాల్పడింది కిరణేనని, కన్నం వేయడం నుండి లొంగిపోవడం వరకు పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం చెప్పారు. నిందితుడు కిరణ్ను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడారు. కిరణ్ తన కజిన్ బ్రదర్ ఆనంద్తో కలిసి చోరీకి పాల్పడ్డాడని చెప్పారు. చోరీకి పాల్పడిన వారిలో కిరణ్, ఆనంద్తో పాటు ఎవరైనా ఉందా విచారణలో తేలుతుందన్నారు.
రూ.19.20 కోట్ల విలువైన ముప్పై కిలోల బంగారం పోయిందని యజమానులు ఫిర్యాదు చేశారని, తాము రూ.5.57 కోట్ల విలువైన 15.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు శానిటేషన్ పైప్ లైన్ వర్కర్లు కాబట్టి ఆ అనుభవంతో రెక్కీ నిర్వహించి రెండు రోజుల ముందు నుండే గోడకు కన్నం వేయడం ప్రారంభించారని చెప్పారు. షోరూం లోపల సిసి కెమెరాలు ఉంటాయని తెలిసి వారు విద్యుత్ దీపాలను పగుల గొట్టారని చెప్పారు.
పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు వారు వికలాంగుడిగా నటించారని చెప్పారు. నిందితుల గత చరిత్ర విచారించాల్సి ఉందని చెప్పారు. దొంగతనం జరిగాక మీడియా, పోలీసుల హడావుడి ఎక్కువ కావడంతో భయపడిన నిందితులు లొంగిపోయేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. ఆనంద్ కొంత బంగారం తీసుకొని వెళ్లిపోగా, మిగిలిన దాంతో కిరణ్ లొంగిపోయాడని చెప్పారు. ఆనంద్ కోసం వెదుకుతున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు ఇద్దరు ఈ దొంగతనంలో ఉన్నట్లు తేలిందని, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది విచారణలో తేలుతుందన్నారు. తాము సెక్యూరిటి లోపంపై దృష్టి సారించామని చెప్పారు. ఆనంద్ దగ్గర ఉన్నది మినహా తాము స్వాధీనం చేసుకున్నామని, అతనిని వెదికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులు గుంటూరు జిల్లా ఈపూరు వాసులన్నారు.
రెక్కీ నిర్వహించి, అందరు కళ్లు గప్పి రెండు రోజుల ముందు నుండే కన్నం వేయడం ప్రారంభించి, విద్యుత్ లైట్లు పగుల గొట్టి, వికలాంగులుగా నటించడమే కాకుండా లొంగిపోవడం కూడా పథకం ప్రకారం జరిగింది. కాగా, 522 గాజులు, 40 బ్రేస్లెట్లు, 58 చెవి రింగులు, 98 ఉంగరాలు, 33 గొలుసులు, 89 పెండెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.