ఏపీలో అధికార పార్టీని వణికిస్తున్న మహమ్మారి.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
సాధారణ ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదలకుండా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5,27,512 కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా 4,634 మంది మరణించారు . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అధికార పార్టీ నేతలను వణికిస్తోంది.
కరోనా కల్లోలం .. ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలు దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణ
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.
ఇక తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి, అలాగే ప్రభుత్వ విప్, తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం వారు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం ఆళ్ల రామకృష్ణా రెడ్డి తండ్రి దశరధ రామిరెడ్డి మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్ కె కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. తన తండ్రి మృతి సమయంలో తనను వచ్చి కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని ఆర్కే తెలిపారు.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా తేలడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 14 రోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా చికిత్స తీసుకోవడానికి విశాఖపట్నానికి వెళ్ళినట్లుగా తెలిపారు. ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటే, అధికార వైసీపీలోనే పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న తీరు అధికార పార్టీ నేతలకు టెన్షన్ పుట్టిస్తుంది.