కరోనా ఎఫెక్ట్: ఒకేసారి ఆరు నెలల రేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇక భారత్ లో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇప్పటికే భారత్ లోకి విదేశీయులు రాకుండా నిషేధం విధించిన కేంద్రం , తాజాగా ప్రవాస భారతీయులకు కూడా నో ఎంట్రీ చెప్పేసింది. ఇక ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 166 నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా షట్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాల్స్, విద్యాసంస్థలు, థియేటర్లు , రెస్టారెంట్లు మూసివేయగా మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాట పడుతున్నాయి. ఇక ఇంకా వ్యాప్తి చెందితే నియంత్రణ కష్టం అవుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజాపంపిణీ ద్వారా అందించే రేషన్ పై కేంద్రం నిర్ణయం
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. రాష్ట్రాలు షట్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా ప్రభావంతో దాదాపు భారతదేశం కూడా కొద్దిరోజులు షట్డౌన్ కానుండగా పేదలకు ఇచ్చే రేషన్ విషయంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ సరుకులు ఆరు నెలలకు సరిపడా ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఆరునెలల రేషన్ అందించే దిశగా కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా సుమారు 75 కోట్ల మంది సబ్సిడీలో ఇచ్చే ఆహార పదార్ధాలైన బియ్యం, గోధుమలు, పంచదార, తదితర రేషన్ సరుకులను ఆరు నెలలవి ఒకేసారి తీసుకోవచ్చునని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. ప్రస్తుతం వినియోగదారులు చాలా రాష్ట్రాల్లో రెండు నెలల రేషన్ సరుకులు ముందుగా తీసుకుంటున్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం ఆరు నెలల రేషన్ సరుకులను అందిస్తుంది.
Recommended Video
కరోనా ప్రభావం దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించిన మంత్రి
ఇక గోడౌన్లలో ఆరు నెలలకు సరిపడా కావాల్సినన్ని ఆహార పదార్ధాలు ఉన్నాయని కరోనా ప్రభావం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పేదలకు ఆరు నెలల రేషన్ సరుకులను ఇవ్వాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. ఏది ఏమైనా కరోనా ఇటు భారత దేశంలోనూ కరాళ నృత్యం చేస్తున్న వేళ కేంద్ర సర్కార్ నియంత్రణ , నివారణ దిశగా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుంది.