ఏపీలో కరోనా ఎఫెక్ట్ .. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆ పని చెయ్యనక్కర్లేదన్న సర్కార్
చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. ఏపీ సర్కార్ కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాపిస్తుంది అని ప్రజలు తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చెయ్యటమే కాదు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది .
Recommended Video
కరోనా ఒక మహమ్మారి.. ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ: ప్రపంచాన్ని వణికించిన 'మహమ్మారి' వైరస్ లు ఇవే
ఏపీలో ఒక కరోనా పాజిటివ్ కేసు
కరోనా వైరస్ లక్షణాలతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదైంది. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు వైద్యాధికారులు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
కరోనా వ్యాపించకుండా ఏపీ ప్రభుత్వ నిర్ణయం
దీంతో కరోనా బాధితుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ కేసు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.ఇక దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలలోనూ ఉద్యోగులు బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్ర వేసి హాజరు కావాల్సి ఉండగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది.
బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు
ఈ మేరకు సీఎం అదనపు కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరు వేసే క్రమంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించి ముందుస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే గవర్నమెంట్ ఆఫీసులలో బయోమెట్రిక్ హాజరు నమోదుకు బదులు , ఫిజికల్ అటెండెన్స్ తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ఆదేశమిచ్చింది.