కరోనా ఎఫెక్ట్ .. ఏపీలోని ఆ జిల్లాలో స్కూళ్ళు , థియేటర్లు బంద్
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మరి. ఎవరికైనా జలుబు , దగ్గు ఉంది అంటే ఆమడ దూరం పారిపోతున్న పరిస్థితి . ఇప్పుడు ఈ వైరస్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒకటి ఏపీలో నమోదయ్యింది . కరోనా లక్షణాలతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదు కావటంతో అప్రమత్తమైన ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది.
ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించడంతో జగన్ సర్కార్ హై అలెర్ట్ ప్రకటించింది.ఈ మేరకు విశాఖలోని కృష్ణపట్నం పోర్టు, నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేసింది. ఇక ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించటం కోసం నెల్లూరులోని పాఠశాలలకు ఈ నెల 18 వరకు సెలవులు ప్రకటించారు. అంతే కాకుండా అన్ని థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ను సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు స్పష్టం చేశారు.
ఇక ఒక కేసు నమోదు అయిన నేపధ్యంలో ఇక మాల్స్ను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఎక్కువగా గుంపులుగా తిరగవద్దని చెప్పామని,బయటికి వచ్చేటప్పుడు మాస్క్ లు ధరించి రావాలని తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 9 మంది కరోనా అనుమానితులు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతుండగా మరో 150 మంది ఈ వైరస్ అనుమానితుల కుటుంబ సభ్యులు ఉన్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. రెండు ప్రత్యేక వైద్య బృందాలు వీరిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు . ఏది ఏమైనా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్న సర్కార్ ఏ మేరకు ఈ వైరస్ ను కంట్రోల్ చేస్తుందో వేచి చూడాలి .