ఉల్లి రైతులను కన్నీరు పెట్టిస్తున్న కరోనా ... రైతన్నకు ఊహించని కష్టం
ఊహించని ఉపద్రవం రైతన్నలను ఆవేదనకు గురి చేస్తుంది . అతివృష్టి , అనావృష్టి పరిస్థితులను తట్టుకుని , పంటలకు వచ్చే చీడపీడలను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కరోనా కాటు వేసింది. పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసింది . లాక్ డౌన్ కారణంగా మార్కెట్ యార్డులు క్లోజ్ ఉన్న నేపధ్యంలో పొలాల్లోనే పంటకు కాలి కాస్తున్నారు రైతులు . ఈసారి కూడా కష్టాల సాగు, నష్టాల సాగే అని లబోదిబోమంటున్నారు.
కరోనా విషయంలో వాస్తవాలను తొక్కి పెట్టటం మంచిది కాదు : జగన్ కు చంద్రబాబు లేఖ
లాక్ డౌన్ తో ఉల్లి రైతులు విలవిల
కరోనా వైరస్ ప్రభావంతో ముఖ్యంగా ఉల్లి సాగు చేసిన రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు . ఆరుగాలం శ్రమించి ఉల్లి సాగు చేస్తే అమ్ముకునే పరిస్థితి లేదని అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో క్వింటా రూ.13 వేలు పలకడంతో ఈ సీజన్లోనూ ఉల్లి సాగు చేస్తే కాస్త సమస్యల నుండి గట్టెక్కుతామని భావించిన రైతులు ఉల్లి వైపే మొగ్గుచూపారు. పంట బాగా పండింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో ఉల్లి రైతులు మార్కెట్ లకు పంటను తరలించే పరిస్థితి లేదు . ఇక మార్కెట్ లు కూడా క్లోజ్ ఉండటంతో ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి .
తగ్గుతున్న ధరలతో రైతన్నల కుదేలు
ఇక ఇదిలా ఉంటే వారం క్రితం వరకు క్వింటా రూ.3వేల దాకా పలికిన ధరలు ఒక్కసారిగా రూ.700-800కు పడిపోయాయి. దీంతో పొలాల్లో సిద్ధంగా ఉన్న పంటను నష్టానికి అమ్మలేక.. దాన్ని అలాగే ఉంచుకోలేక ఉల్లి రైతులు వాపోతున్నారు.. ప్రస్తుతం పొలాల్లోనే టెంట్లు వేసి తమ పంటకు కావలి కాస్తున్నారు. రెండ్రోజుల్లో గిట్టుబాటు ధర వస్తే సరి లేకుంటే గొర్రెలకు ఆహారంగా వేయాల్సిందేనంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉల్లి అత్యధికంగా పండించే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో ఏకంగా 3,500 హెక్టార్లలో పంట సాగు చేశారు. ఎకరాకు రూ.50వేల చొప్పున రూ.40 కోట్ల పెట్టుబడి పెట్టారు. కానీ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అమ్మితే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.
Recommended Video
మార్కెట్లు బంద్ ... పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలని డిమాండ్
ఒక్క కర్నూలు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అలాగే ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రాదేమో అని ఉల్లి రైతులు బాధ పడుతున్నారు. ప్రభుత్వం తమ పంటను కొనుగోలు చెయ్యాలని , గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లు బంద్ చేసి, రైతు బజార్ లు సైతం మూసేసిన ప్రభుత్వం ఉల్లి రైతుల గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకపక్క తెలంగాణా సర్కార్ అన్ని పంటలను కొనుగోలు చేస్తామని , గిట్టుబాటు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు భరోసా ఇచ్చింది . ఇక ఏపీ సర్కార్ కూడా తమకు న్యాయం చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.