కరోనా కల్లోలం .. తగ్గాలని తెలుగు రాష్ట్రాల్లో యాగాలు,యజ్ఞాలు
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యటానికి అటు ప్రభుత్వాలు నడుం బిగించాయి. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనా కంట్రోల్ కోసం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కరోనా నియంత్రణకు యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.
విశాఖ శారదా శక్తి పీఠంలో విషజ్వరపీడ హర , అమృత పాశుపత యాగం
విశాఖ శారదా శక్తి పీఠంలో విషజ్వరపీడ హర , అమృత పాశుపత యాగం నిర్వహిస్తున్నారు. ఇక మరోపక్క టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో ధన్వంతరి యాగం నిర్వహిస్తున్నారు. ఇక చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక పూజలు , యాగం నిర్వహించారు.విశాఖ శ్రీ శారదా పీఠం లో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ , పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ ఆధ్వర్యంలో విషజ్వరపీడ హరయాగం , అమృత పాశుపత యాగం నేటి నుండి ప్రారంభం అయ్యింది .
ప్రపంచం యావత్తు ఆయురారోగ్యాలతో ఉండాలని 11 రోజుల పాటు యాగం
దేశ ప్రజలు , ప్రపంచం యావత్తు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీ శారదా పీఠం ఈ మహా యాగం నిర్వహిస్తుంది. విషజ్వరపీడ హర , అమ్మత పాశుపత యాగం 11 రోజుల పాటు ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతుంది .ప్రస్తుతం భారత దేశ గ్రహ ప్రభావం సరిగా లేనందున అటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు . ఇక ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం ఉంది . ఈ పరిస్థితుల్లో దైవానుగ్రహ కార్యక్రమాలతో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ యాగం సందర్భంగా పేర్కొన్నారు .
విపత్కర పరిస్థితులలో ఆరోగ్య రక్షణకు యాగ నిర్వహణ
అందుకే విషజ్వరపీడ హర , అమృత పాశుపత యాగం 11 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు . ఋగ్వేదం , అధర్వణ వేదాల్లోని ఆరోగ్య మంత్రాలు , యోగవాశిష్టంలోని బీజాక్షరాలను సంపుటి చేసి ఋత్వికులు ఈ యాగం నిర్వహిస్తారన్నారు . దేశం సుభిక్షంగా , ప్రజలంతా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలనే ఆకాంక్షతో స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులుతో యాగం నిర్వహిస్తున్నట్టు స్వాత్మానందేంద్ర తెలిపారు .
తిరుమలలో కరోనా నివారణకు శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహా యాగం
కరోనా వైరస్ నియంత్రణ కోసం తిరుమలలో కూడా ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు మార్చి 19 నుంచి 21వ తేది వరకు శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహా యాగం నిర్వహించనున్నారు . యాగానికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామిజీలు హాజరు కానున్నారు. దేశంలో రోగాపీడలు, కరోనా ప్రభావం తగ్గాలని యాగం నిర్వహించనున్నారు .
Recommended Video
అన్నవరంలో కొనసాగుతున్న అపమృత్యు, ధన్వంతరి, మృత్యుంజయ యాగాలు
ఇక అన్నవరం సత్యన్నారాయణ స్వామీ ఆలయంలో కూడా కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక పూజలు , యాగాలు నిర్వహించనున్నారు.అన్నవరం దేవస్థానంలో లోక కల్యాణం కోసం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చతుర్వేద సహిత పంచాయతన పూర్వక త్రిపాదిభూతి మహా వైకుంఠ నారాయణ యాగం నిర్వహిస్తున్నారు. ఇక ఈ యాగం రేపటి వరకు కొనసాగుతుంది. ఇక అంతే కాదు అపమృత్యు, ధన్వంతరి, మృత్యుంజయ యాగాలు నిర్వహిస్తున్నారు. కరోనా పీడ విరగడ కావాలని తెలుగు రాష్ట్రాల్లో ఈ యాగాల నిర్వహణ చేస్తున్నారు. ఆ భగవంతుడే ఇలాంటి రోగ పీడల నుండి ప్రజలను కాపాడతారని భావిస్తున్న నేపధ్యంలో ఈ యాగాలు చెయ్యటం జరుగుతుంది.