కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ సర్కార్ .. 23 మందికి పరీక్షలు చేస్తే ..
నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కరోనా కేసులు అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. ఇక ఈనేపధ్యంలో ఏపీ సర్కార్ ప్రజలకు కరోనా వైరస్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పిన ఆరోగ్య శాఖ తాజాగా కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కరోనా భయం పోగొట్టేందుకు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కాగా ఇక తాజాగా ఏపీకి కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఇక భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది ఏపీ సర్కార్ . కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ వ్యక్తి ని ఐసోలేషన్ వార్డులో ఉంచారని, ఇక ఏలూరులోనూ ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నారని భయపడుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానంతో ఎంతమంది శాంపిల్స్ టెస్ట్ లకు పంపించారో.. ఏం రిపోర్ట్స్ వచ్చాయో జిల్లాల వారీగా నివేదిక ఇచ్చింది.
23 మంది శాంపిల్స్లో ఇప్పటివరకు 11 మందికి నెగెటివ్..
ఇక ఇప్పటివరకు 23 మంది శాంపిల్స్ను పరీక్షల కోసం పంపామని చెప్పిన వైద్య శాఖ 11 మందికి నెగెటివ్ అని తేలిందని ఇంకా 12 శాంపిల్స్ రిపోర్టు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారికి తగు సూచనలు చేసింది. 28 రోజులు కచ్చితంగా ఇంట్లోనే వైద్య పరిశీలనలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. జ్వరం, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే మాస్క్ ధరించి అంబులెన్స్లో దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిట్లో చేరాలని లేదంటే కంట్రోల్ రూం నంబర్కు కాల్ చేయాలని సూచించింది.
స్వస్థలాలకు వచ్చిన 330 మంది ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి
ఎవరూ భయపడవద్దని 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, కంట్రోల్ రూమ్ పని చేస్తుందని పేర్కొంది. ఇక కరోనా వైరస్ సోకిన దేశాల నుండి స్వస్థలాలకు వచ్చిన 330 మంది ప్రయాణీకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పిన వైద్య శాఖ 102 మందిని వారి వారి ఇంట్లోనే ఐసోలేషన్ పద్ధతుల్లో ఉంచామని పేర్కొన్నారు. ఇక 216 మందిని ఐసోలేషన్ వార్డులో 28 రోజుల పాటూ ఆబ్సర్వేషన్ లో ఉంచినట్లు తెలిపారు. వారికి కరోనా లేనట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పారు.
ఇంకా 12 మంది రిపోర్ట్స్ కోసం నిరీక్షణ
12 మంది ప్రయాణీకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పిన వైద్య శాఖ ఇంకా వారి రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక జిల్లాల వారీగా ఎంత మంది కరోనా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చారో వారిలో ఎంత మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారో అన్ని వివరాలతో పూర్తిగా డేటాను హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించారు వైద్య శాఖాధికారులు.
ఒక్క కేసు కూడా లేదు.. అయినా జాగ్రత్త అవసరం అని సూచన
ఇక అంతే కాదు కరోనా వైరస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జలుబు చేసి తుమ్ములు, దగ్గు వస్తే చేతి రుమాలు తో కానీ టిష్యూ తో కానీ మోచేతిని కానీ అడ్డు పెట్టుకోవాలని , చేతులతో తుదవకూడదని చెప్పారు. ఇక అలాంటి వారితో కరచాలనం మానుకోవాలని కూడా చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తి చెందకుండా కాపాడుకోవాలని , ప్రస్తుతం ఏపీలో కరోనా ప్రభావం లేదని , ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్తున్నారు.