విజయవాడ జీజీహెచ్ లో కరోనా కలకలం: ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సహా 50 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. విపరీతంగా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇక మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఏపీలో కడప రిమ్స్ లో వైద్య విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా విజయవాడ జీజీహెచ్ లో కరోనా కలకలం రేగింది.
విజయవాడ జీజీహెచ్ లో 50 మందికి కరోనా
విజయవాడ జిజిహెచ్ లో 50 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. వీరిలో 20 మంది జూనియర్ వైద్యులు ఉన్నారు. మిగతా వారంతా వైద్య సిబ్బంది కావడం గమనార్హం. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సహా జూనియర్ వైద్యులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా బారిన పడిన వారంతా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. విజయవాడ జీజీహెచ్ లో వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరిన బాధితులు సరైన వైద్యం అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్న వైద్యులు
అప్రమత్తమైన అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక విజయవాడలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ సారి కరోనాపై పోరాటంలో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందితో పాటు ఫ్రంట్లైన్ వారియర్స్ కరోనా బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు.కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగాకరోనా నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య సోమవారం నాడు 4,108గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,182 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. సోమవారంనాడు కరోనా మహమ్మారి బారినుండి 696 మంది కోలుకోగా ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం ఊరట నిచ్చే అంశం. విపరీతంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కఠిన ఆంక్షల నిర్ణయం తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం నేటి నుండి నైట్ కర్ఫ్యూను ఏపీలో అమలు చేయాలని నిర్ణయించింది.
కరోనాపై ప్రభుత్వాలు అలెర్ట్ .. ఒమిక్రాన్ వల్లే కరోనా కేసులలో ఈ పరిస్థితి
సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలలో విపరీతమైన కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. సోమవారం నాడు ఈ రెండు జిల్లాలలో నమోదైనది కరోనా కేసుల సంఖ్య ఒక్కొక్క జిల్లాలో వెయ్యి దాటింది.
కరోనా కేసులు పెరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పదేపదే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకుండా పోతుంది. కరోనా సెకండ్ వేవ్ కంటే ఈ వేవ్ లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న నేపధ్యంలో ప్రజల్లో కరోనా విషయంలో ఒకింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఫలితంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వల్లే కరోనా కేసులలో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.