కరోనా కారణం అని లేఖ .. రాజమండ్రిలో దంపతుల మృతి పై అనుమానాలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతోంది. ఎవరు తుమ్మినా దగ్గినా కరోనా వైరస్ అన్న భయం ప్రజలను వేధిస్తోంది. ఇక కరోనా భయంతో కర్ణాటక లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోగా నేడు రాజమండ్రిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు .
రాజమండ్రిలో దంపతులు అనుమానాస్పద మృతి
అసలు విషయానికి వస్తే రాజమండ్రిలో దంపతులు అనుమానాస్పద మృతి చెందారు . సంఘటనా స్థలంలో వారు రాసిన లేఖలో కరోనా రావటం వల్ల తాము చనిపోతునట్టు రాసి మరీ మృతి చెందారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . రాజమండ్రి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ గా పని చేసే రమేష్, వెంకట లక్ష్మి దంపతులు సగం కాలిన దేహాలతో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కరోనా వచ్చిందని సూసైడ్ నోట్ .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇక స్థానికుల కథనం ప్రకారం వారికి చాలా కాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని , వారు ఏ కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలీదని అంటున్నారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన ఒక బ్యాగ్ లో వారికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లు దొరికాయి. ఇక అంతే కాకుండా రెండు లైన్ల లేఖ సంఘటనా స్థలంలో దొరికింది . దీంతో పోలీసులు కరోనా వచ్చింది అన్న అనుమానంతో సూసైడ్ చేసుకున్నారా లేకా ఎవరైనా చంపి ఇలా క్రియేట్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కరోనాతో చనిపోయారని స్థానికుల ఆందోళన
ఇక ఈ రోజు జరిగిన ఈ ఘటనతో రాజమండ్రి వాసులు ఉలిక్కిపడ్డారు. కరోనా సోకటం తో చనిపోయారని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. ఇక పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు . ఏది ఏమైనా కరోనా భయంతో ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది.