తెలుగు రాష్ట్రాల్లో భారీ పెరిగిన కరోనా కేసులు: ఏపీ-149, తెలంగాణ 154, బాపట్లలో యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్: ఢిల్లీ తబ్లీఘీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు తిరిగి రాష్ట్రాలకు చేరుకోవడం, వారిలో చాలా మందికి కరోనా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గురువారం ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో 65 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
ఏపీలో ఒక్కరోజే 38 కొత్త కేసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజే 38 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్క మొత్తం కేసుల సంఖ్య 149కి చేరింది. మరో 403 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో టెస్టింగ్ సెంటర్లను కూడా సర్కారు పెంచింది. ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్ సెంటర్లు ఉండగా.. ఇప్పుడు అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి ఈ రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేంద్రాలు కూడా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యం రోజుకు 140 నుంచి 570కి పెరగనుంది.
తెలంగాణలో 27 కొత్త కేసుల నమోదు..
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పెరిగింది. ఒక్క రోజులోనే 27 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 17 మంది కరోనా బాధితులు కోలుకోగా, 9 మంది మృతి చెందినట్లై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Recommended Video
పోలీసులు అడ్డుకున్నారని యువకుడు ఆత్మహత్య..
ఇది ఇలావుండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరిని రోడ్లపైకి రానివ్వని విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉండి మీరు, మీతోపాటు సమాజాన్ని క్షేమంగా ఉంచండని ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే, చిత్తూరు జిల్లాలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువకుడు.. తన బైక్ మీద తన సొంత ప్రాంతం కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు బయలుదేరాడు. అతడ్ని బాపట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బైక్ సీజ్ చేసి, అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై అతడ్ని విడుదల చేశారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు పేడాడ శ్రీనివాసరావు(21) బాపట్ల కొత్త బస్టాండ్ ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన మరణానికి వెదుళ్లపల్లి పోలీసులే కారణమని అతడు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం గమనార్హం. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.