ఏపీని వణికిస్తున్న కరోనా: సచివాలయంలో మరో ఐదుగురికి..మంత్రి కుమారుడికీ పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. ఏపీలో కరోనా కల్లోలం నేపథ్యంలో అధికారులు , ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు .ఇప్పటికే కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కల్లోలం మాత్రం ఆగటం లేదు. తాజాగా సచివాలయ ఉద్యోగులకు, మంత్రి కుమారుడికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటం ,జిల్లాల్లోనూ బీభత్స పరిస్థితులు నెలకొనటంతో కరోనా ఏపీ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్
ఇదే సమయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం, ధర్మాన కృష్ణదాస్ అనుచరులకు ఆందోళన కలిగిస్తోంది. కుమారుడికి పాజిటివ్ రావడంతో నిన్నటి నుండి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు. అయితే మంత్రి ధర్మాన కృష్ణదాస్ బుధవారం నాడు ఆమదాలవలస లో జరిగిన వైయస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆరోజు జరిగిన కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కూడా పాల్గొన్నాడు.
మంత్రి ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాంలు హోమ్ క్వారంటైన్
దీంతో ధర్మాన కృష్ణ దాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో, మంత్రి ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం కూడా హోమ్ క్వారంటైన్ కు వెళ్లిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ తరపున కుమారుడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన చేశాడు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.దీంతో ఆయనతో తిరిగిన కార్యకర్తలు ప్రస్తుతం ఆయనకు కరోనా రావటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం ల కార్యాలయాలు మూసివేసిన విషయం తెలిసిందే. పదిహేను రోజుల వరకు ప్రజలెవరూ వారిని కలవడానికి రావద్దని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
ఏపీ సచివాలయాన్ని వదలని కరోనా.. మరో ఐదుగురికి
ఇదే సమయంలో ఏపీ సచివాలయంలో మరోమారు కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ సచివాలయం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 23,814 కేసులు నమోదు కాగా 11,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 12,154 మంది ఉన్నారు . ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా 277 మంది మరణించారు. ఇప్పటి వరకు ఏపీలో 1.1 మిలియన్ టెస్టులు నిర్వహించారు .
ప్రకాశం జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు
ఏపీలో మొత్తంగా తాజా పరిస్థితిని బట్టి చూస్తే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,406 కేసులు ,తర్వాత స్థానంలో గుంటూరు జిల్లాలో 1,355 యాక్టివ్ కేసులు ఉన్నాయి .
మరోపక్క ప్రకాశం జిల్లా వాసులను కరోనా భయపెడుతుంది తాజాగా మరో 128 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . దీంతో ప్రకాశం జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 1321 కరోనా కేసులు జిల్లాలో నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో కరోనా బారినపడిన యాక్టివ్ కేసులు ప్రస్తుతం 554 మంది కాగా కరోనా నుండి కోలుకున్న వారు 767 మంది.
కర్నూలులోనూ కరోనా కల్లోలం
మరోపక్క కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి . కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కరోనా కేసులు ఒక్కరోజులోనే 30 నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 1,087 యాక్టివ్ కేసులున్నాయి . 1,617 మంది రికవర్ అయ్యారు. 91 మంది మరణించారు. రోజురోజుకు ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారిక వర్గాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.