షాకింగ్ ... ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి పేషీలో కరోనా .. హుటాహుటిన మంత్రికి , సిబ్బందికి పరీక్షలు
కరోనా మహమ్మారి ... ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు దేశంలోనూ విజృంభిస్తోంది. ఈ కరోనాని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ తో కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ జరుగుతుందని భావిస్తుంది . అయినా దేశంలో ఈ ప్రాణాంతక మహమ్మారి అంతు చిక్కని విధంగా పెరుగుతూనే ఉంది . కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటు ఏపీలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి పేషీలో కరోనా కలకలం రేగిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు .
మంత్రులను కూడా టెన్షన్ పెడుతున్న కరోనా
ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం 1332 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటికే 31 మంది మృత్యు వాత పడ్డారు. ఇక ప్రభుత్వం కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగాన్ని , ఏకంగా మంత్రులను కూడా కరోనా టెన్షన్ పెడుతుంది.
మంత్రి పేషీలో అటెండర్ కు కరోనా పాజిటివ్
తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలోనే కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఓ అటెండర్కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్న అటెండర్ కి నిర్వహించిన ట్రూనాట్ పరీక్షలో ప్రిజంప్టివ్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో తుది నిర్ధారణ కోసం నమూనాను వైరాలజీ ల్యాబ్కి పంపారు. ఇక అటెండర్ కు కరోనా రావటంతో పేషీలోని ఉద్యోగులంతా వణికిపోతున్నారు. అటెండర్ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు.
మంత్రి, భద్రతా సిబ్బంది, పేషీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు
ఇక పేషీలో అటెండర్ కు కరోనా అని తెలియటంతో పేషీలో శుభ్రతా చర్యలు చేపట్టారు. మొత్తం పేషీని శానిటైజ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి , ఆరోగ్య శాఖామంత్రి అయిన ఆళ్ళ నాని, ఆయన భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందికి పరీక్షలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో వారందరికీ నెగెటివ్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు. కానీ వారిలో మాత్రం ఇంకా కరోనా భయం పోలేదు.
Recommended Video
కరోనా కట్టడికి పని చెయ్యాల్సిన ఆరోగ్య శాఖనే వణికిస్తున్న కరోనా
కరోనా సోకినా వెంటనే బయటకు రావాలని లేదు కాబట్టి వీరంతా సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకపక్క రాష్ట్రంలో కరోనా నేపధ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ఇక ఈ సమయంలో ఆరోగ్య శాఖాధికారులు పని కీలకంగా మారింది. కానీ వారే కరోనా మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న పరిస్థితిలో ఏపీలో ఉలిక్కిపడింది. ఇటీవల ఏపీ గవర్నర్ కార్యాలయం రాజ్భవన్లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే . ఇక తాజాగా ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేస్తున్న అటెండర్ కూడా కరోనా బారిన పడటం ఇప్పుడు కరోనా హైరానాను మరింత పెంచింది.