ఏపీలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ ... హైదరాబాద్ లో చికిత్స
ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. సాధారణ ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదలకుండా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఏపీకి సంబంధించిన పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కరోనా బారినపడి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకులను కరోనా వదలకుండా వేధిస్తోంది. దేశంలోనే కరోనా కేసులలో రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
కరోనా నుండి కోలుకున్న వారందరిలోనూ యాంటీ బాడీలు లేవు : సెరో సర్వేలో షాకింగ్ అంశాలు
ఏపీ లోని ప్రజా ప్రతినిధులను సైతం కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మంది నేతలు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా అయితే కరోనా బారిన పడ్డారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ అధికార పార్టీలోనే కరోనా కరాళ నృత్యం చేస్తోంది.
ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
ఇటీవల చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . దీంతో ఆయనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి న పరిస్థితి . కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేని కూడా కరోనా బారినపడి హైదరాబాద్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి, అంజాద్ బాషా తదితరులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అధికార పార్టీలో వరుసగా నేతలు కరోనా మహమ్మారి బారిన పడుతుండటం వైసీపీ నేతలకు టెన్షన్ పుట్టిస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న నేపథ్యంలో ఏపీ లోని రాజకీయ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.