నిన్న ప్రగతిభవన్.. నేడు ఏపీ సీఎం జగన్ నివాసం .. 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఏపీ సెక్రటేరియట్, హైకోర్టులో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రమే కాకుండా తాజాగా తాడేపల్లి జగన్ నివాసం వద్ద కూడా కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కరోనా కలకలం నెలకొంది.
ఏపీలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో ఇప్పటివరకూ 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు గా తేలింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు , మరో బెటాలియన్కు చెందిన ఇద్దరు గార్డులకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు . ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించగా ఈ పలితాల్లో పది మందికి కరుణ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సీఎం నివాసం వద్ద కలకలం మొదలైంది. గతంలో కూడా సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది.
Recommended Video
నిన్నటికి నిన్న తెలంగాణ సీఎం కెసిఆర్ నివాసముండే ప్రగతి భవన్ వద్ద కూడా సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. 20 మంది ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రగతి భవన్ శానిటైజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో తెలంగాణా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఇదే సమయంలో ఈరోజు ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద కూడా సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు తెలియడంతో సీఎం జగన్ కు కరోనా సెగ తగిలినట్టయ్యింది . దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.