ఏపీలో కరోనా అనుమానితురాలు మృతి .. కరోనా ప్రభావంతో హైకోర్టు కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. ఇక తాజాగా కరోనా అనుమానిత లక్షణాలున్న మహిళ మృతి చెందింది. కాకినాడ ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతూ అంతర్వేదిపాలెం కు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలే దుబాయ్ నుంచి అంతర్వేదిపాలెం ఆమె వచ్చినట్లు గ్రామస్థులు చెప్పారు. అయితే కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి నిన్న కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు. ప్రాథమికంగా మెదడువాపుతో మృతి చెందినట్లు భావిస్తున్నామని, కరోనా పరీక్షలు రిపోర్టు రావాల్సి ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఏది ఏమైనా ఏపీలోనూ కరోనా కలకలం నేపధ్యంలో ప్రజలు భయపడుతున్నారు.
ఏపీలో కరోనా ఎఫెక్ట్ .. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆ పని చెయ్యనక్కర్లేదన్న సర్కార్
ఏపీ సర్కార్ కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాపిస్తుంది అని ప్రజలు తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చెయ్యటమే కాదు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది . ఇప్పటికే కరోనా బాధిత వ్యక్తి ఉన్న నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేసిన సర్కార్ , ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా బయో మెట్రిక్ విధానాన్ని తీసివేసి ఫిజికల్ అటెండెన్స్ తీసుకోవాలని పేర్కొంది.
ఇక తాజాగా ఏపీ హైకోర్టు కూడా కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది . కరోనా ఎఫెక్ట్తో రేపటి నుంచి అత్యవసర కేసులు మాత్రమే ఏపీ హైకోర్టు విచారించనుంది. హైకోర్టుకు వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గుంపులుగా జనాలు లేకుండా చూడాలని , హైకోర్టుకు వచ్చే వారికి కూడా జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని నిర్ణయం తీసుకుంది . ఈనెల 30 వరకు కోర్టుకు వచ్చే లాయర్లు, ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.