తెలుగు రాష్ట్రాలకు తలనొప్పిగా కరోనా .. సరిహద్దుల్లో నో ఎంట్రీ .. నిబంధనలు కఠినతరం
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,980 కరోనా కేసులు నమోదు అయ్యాయి . ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఏపీతో పోల్చి చూస్తే తక్కువ ఉన్నప్పటికీ తెలంగాణాలోనూ కరోనా కేసులు పెరిగాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలో 1,196 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలోని కర్నూలు జిల్లాలో 566 కేసులు, గుంటూరు జిల్లాలో 382 కేసులతో టాప్ పొజిషన్ లో ఉన్నాయి. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే కరోనా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది.
తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం .. ఏపీ,మహారాష్ట్రలకు వెళ్ళకుండా నిషేధం
ఆంధ్రా నుండి వచ్చే వారిని అనుమతించవద్దని తెలంగాణా ప్రభుత్వ ఆదేశాలు
ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్కు వెళ్లకుండా నిషేధం విధించింది తెలంగాణా సర్కార్ అన్న సంగతి అందరికీ తెలుసు . కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే వారిని చెక్ పోస్టుల దగ్గర అధికారులు ఆపేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వారిని తెలంగాణాలోకి అనుమతించకూడదని చెప్తున్నారు . ఇక వారికి అధికారుల నుండి అనుమతి పత్రం ఉంటే వారి వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే తెలంగాణలోకి వచ్చే అవకాశం ఇస్తున్నారు.
తెలంగాణాలోకి అనుమతితో వచ్చినా సరే 14 రోజుల క్వారంటైన్
ఇక తెలంగాణా రాష్ట్రంలోకి వచ్చాక వారికి ప్రతి ఒక్కరికి క్వారంటైన్ స్టాంప్ వేస్తున్నారు. 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలంటూ అధికారులు వారికి చెబుతున్నారు. ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారిని కూడా అధికారులు అనుమతించడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే బోర్డర్ జిల్లాలలోనే కేసులు అధికంగా ఉన్నాయి . ఇక తెలంగాణా నుండి ఆంధ్రాకు , ఆంధ్రా నుండి తెలంగాణాకు జనాల రాకపోకల వల్లే కరోనా పెరుగుతుందని భావించి అటు ఏపీ అధికారులు సైతం ఎవర్నీ రాష్ట్రంలోకి అనుమతించటం లేదు .
సరిహద్దు కర్నూలు, గుంటూరు జిల్లాలలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా కఠిన నిబంధనలు
తెలంగాణా, ఆంధ్రా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా కర్నూలు , గుంటూరు జిల్లాలలో చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. అనుమతి పత్రాలు చెక్ చేసిన తర్వాతే వారిని సరిహద్దుల వద్ద అనుమతిస్తున్నారు. పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ సమన్వయం చేసుకుని చెక్ పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణ వైపు కొంత కేసులు తగ్గుతున్నా, గుంటూరు వైపు , కర్నూలు వైపు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Recommended Video
దొడ్డి దారిన సరిహద్దులు దాటుతున్న వారు.. పెరుగుతున్న కేసులు
ఇక అటు ఏపీ , ఇటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరిహద్దులు దాటుతున్న వారి విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నాయి. ఇక దొంగ దారిన వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్తున్నారు. చాలా జిల్లాలలో అధికారులు అనుమతి ఇవ్వక , బోర్డర్ దాటే వీలు లేక దొంగ దారిన రాష్ట్రాలు దాటుతున్నారు .అలా వెళ్తున్న వారికి నో క్వారంటైన్ .. ఇది కూడా ఒక కొత్త ఇబ్బందిని సృష్టిస్తుంది. ఇక అనుమతులు తీసుకొని ఎవరైతే వస్తున్నారో వారందరి వివరాలు తీసుకోవడంపాటు, ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అధికారులు ఎవ్వరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా వారందరి పేర్లు నమోదు చేసుకుని క్వారంటైన్ కు తరలించే పనిలో ఉన్నారు . ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి . ఇది అత్యంత ఆందోళనకర పరిణామం.