విజయవాడ విద్యుత్ సౌధాలో కరోనా కలకలం: ఒక ఉద్యోగికి కరోనా..టెన్షన్ లో ఉద్యోగులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో విదేశాల నుండి వచ్చిన వారు,లోకల్ కాంటాక్ట్,అలాగే వలస కూలీలతో కరోనా కేసుల సంఖ్య నిత్యం పెరుగుతున్న తీరు ఏపీ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటికి మొన్న ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కేసు నమోదు కాగా,ఇక ఏకంగా ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడం ఏపీలో తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇక నేడు విజయవాడలోని విద్యుత్ సౌధలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం కలకలం గా మారింది. విజయవాడ గుణదల విద్యుత్ సౌధ కార్యాలయ సమూహంలోని విజయవాడ జోనల్ కార్యాలయంలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో అతనితోపాటు ఉద్యోగం చేస్తున్న 22మంది సిబ్బందిని,అతనికి సన్నిహితంగా ఉన్న కారణంతో హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యుత్ సౌధాలో ఉన్న ఉద్యోగులందరికీ కరోనా టెన్షన్ పట్టుకున్న నేపథ్యంలో వారు అందరికీ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ఇక విద్యుత్ సౌధాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో కార్యాలయం అంతా శానిటైజ్ చేశారు అధికారులు . అయితే ఉద్యోగులలో మాత్రం ఆందోళన తగ్గలేదు. ఇక ఈ కార్యాలయంలో సుమారు 500 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.అధికారులు తమకు భద్రత కల్పించాలని, ఆరోగ్య రక్షణకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏపీ లో చూస్తే కరోనా కేసుల సంఖ్య గత 24 గంటల్లో 98 కేసులు నమోదయ్యాయి.రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత విషయంలో తీవ్ర ఆందోళనలో ఉంటున్నారు.