డిసెంబర్ 25.. ఏపీలో వ్యాక్సినేషన్ డేట్ ఫిక్స్.. వ్యూహాత్మకంగా నిమ్మగడ్డకు చెక్ పెట్టిన జగన్...?
ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. తొలి విడతలో కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 4762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కోటికి పైగా కరోనా టెస్టులు నిర్వహించి వైరస్ను నియంత్రించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు.
కేంద్రం సమాచారమిచ్చిందా..?
కరోనా వ్యాక్సిన్,వ్యాక్సినేషన్పై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాకముందే ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 25న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి సమాచారం లేనిదే వ్యాక్సినేషన్ డేట్ను రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసే అవకాశం లేదు. డిసెంబర్ 25వ తేదీన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కావడంతో... ఆరోజు నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా లీకులు వస్తున్నాయి. వ్యాక్సిన్ కంపెనీలకు కూడా దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటు జగన్ సర్కార్ కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఇళ్ల పట్టణాలు పంపిణీ చేయబోతుంది. పనిలో పనిగా అదే రోజు వ్యాక్సినేషన్ లాంచ్ చేయనుంది.
Recommended Video
స్థానిక సంస్థల బ్రేక్ వేసేందుకేనా
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ వేసేందుకే ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యాక్సినేషన్ అంశాన్ని ఉపయోగించుకోబోతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. మంగళవారం(డిసెంబర్ 15) ఇదే అంశాన్ని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు భారీగా ప్రభుత్వ సిబ్బంది అవసరమవుతారు కాబట్టి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కోర్టుకు తెలిపింది. మొదటి డోస్ వేసిన 4 వారాల తర్వాత రెండో డోస్ వేయాల్సి ఉంటుందని.. కాబట్టి నెలల తరబడి సిబ్బంది అందుబాటులో ఉండరని పేర్కొంది. తాజాగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ డేట్ కూడా ప్రకటించేయడంతో.. హైకోర్టు ఆ నిర్ణయాన్ని కాదని ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిచ్చే పరిస్థితి దాదాపుగా ఉండదు. జగన్ ప్రభుత్వం ప్రయోగించిన వ్యాక్సినేషన్ అస్త్రంతో నిమ్మగడ్డకు మరోసారి భంగపాటు తప్పేలా లేదు.
ఇంకా ఏ వ్యాక్సిన్కు అనుమతినివ్వని కేంద్రం...
నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ దేశంలో ఏ కరోనా వ్యాక్సిన్కు అనుమతినివ్వలేదు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ భారత్లో అత్యవసర వినియోగానికి తమకు అనుమతులివ్వాలని ఇప్పటికే డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. కానీ డీసీజీఐ నుంచి ఇంతవరకూ ఎటువంటి స్పందన రాలేదు. యూకె,సింగపూర్లలో అత్యవసర వినియోగానికి ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్కు అనుమతి లభించింది. త్వరలోనే తాము కూడా ఫైజర్కు అనుమతులిస్తామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం ఫైజర్ దరఖాస్తు డీసీజీఐ వద్ద పెండింగ్లో ఉంది.
ఫైజర్కే అనుమతినిచ్చే ఛాన్స్...?
ఇక భారత్లో తయారవుతున్న కోవ్యాగ్జిన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం లోపు అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అత్యవసర వినియోగం కోసం మాత్రం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అటు సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి కోవీషీల్డ్ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అయితే కోవ్యాగ్జిన్,ఫైజర్లకు సంబంధించి మరింత డేటా అవసరమని డీసీజీఐ తెలిపింది. ఇక మిగిలింది ఫైజర్ మాత్రమే. కాబట్టి ఫైజర్కే కేంద్రం అనుమతినిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. తొలి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.