కరోనా వారియర్స్ .. విభిన్న పరిస్థితులతో వైద్య సిబ్బందికి నిద్రలేమి.. వారికి కావల్సిందిదే!!
కరోనా బాధితులకు నిత్యం వైద్యం చేస్తున్న వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ సేవలను అందిస్తున్నారు. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్య సిబ్బంది ఆరోగ్యం, అలాగే వారి మానసిక స్థితిపై జరిగిన అధ్యయనం వారు నిద్రలేమి, మానసిక ఆందోళనతో బాధ పడుతున్నారు అన్న విషయాన్ని వెల్లడి చేసింది. విభిన్న పరిస్థితులలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి నిద్రలేమితో అనారోగ్యం కూడా కలుగుతుంది. ఈ సమయంలోనే వారికి కావాల్సిన మానసిక స్థైర్యం అందించాలని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
వైద్యులు తీవ్ర మానసిక వేదనకు లోనై నిద్రలేమికి గురవుతున్నారని అధ్యయనం
అత్యంత ప్రాణాంతకమైన కరోనా మహమ్మారికి వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతున్న విషయం తెలిసిందే . ఇక ఎంతో మంది వైద్యులు కూడా కరోనా బారిన పడి మృత్యు వాత పడ్డారు . ఇక ఇలాంటి సమయంలో వైద్యులు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై నిద్రలేమికి గురవుతున్నారని అధ్యయనం తేల్చింది . కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిలో మూడింట ఒక వంతు నిద్రలేమికి , మానసిక వేదనకు గురుతున్నారని చైనాలో జరిపిన అధ్యయనం వెల్లడించింది. చైనాలోని గ్యాంగ్జు నగరంలో ఉన్న సౌతెర్న్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది .
కరోనా సేవలు చేస్తున్న వైద్యులపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
కరోనా రోగులకు సేవలందించిన 1563మంది వైద్య సిబ్బందిపై సర్వే జరపగా 564మంది అంటే 36.1 శాతం నిద్రలేమితో బాధ పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు . ఇక వారు వ్యక్తిగత రక్షణా పరికరాలు ధరించి విరామం లేకుండా రోజూ 12 గంటలు విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు . విధి నిర్వహణలో వారికి కలుగుతున్న అలసట , ఇక కరోనా పాజిటివ్ రోగుల నుండి వారికి, వారి ద్వారా కుటుంబాలకు కరోనా సోకుతుందేమో అన్న ఆవేదన వారిని మానసికంగా క్రుంగ దీసి , నిద్రలేమికి కారణం అవుతుందని గుర్తించారు . ఇక ఈ పరిస్థితులు వైద్యుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది .
వైద్యులు దీర్ఘకాలిక మానసిక ఆందోళనలకు , నిద్రలేమికి గురయ్యే ప్రమాదం
కరోనా ఎఫెక్ట్ , కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్యుల ఇబ్బందులు వెరసి వైద్యులు దీర్ఘకాలిక మానసిక ఆందోళనలకు , నిద్రలేమికి గురయ్యే ప్రమాదం కూడా ఉందని అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది తమ అనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేమని చెప్పినా వినే పరిస్థితి కనిపించటం లేదు . ఇక మనదేశంలోనే చాలా రాష్ట్రాలు వైద్యులతో నిర్బంధంగా విధులు నిర్వర్తించేలా చేస్తున్నాయి. ఏపీలో అయితే వైద్యం చెయ్యమని చెప్తున్న వైద్యులపై ఎస్మా ప్రయోగిస్తామని చెప్పటం గమనార్హం .
వైద్యులకు కావాల్సింది ఒత్తిడి కాదు .. ప్రభుత్వాల , ప్రజల సపోర్ట్
మౌలిక సదుపాయాలూ కల్పించకుండా, పూర్తి స్థాయిలో రక్షణ లేకుండా వైద్యులను వైద్యం చెయ్యమని చెప్తున్న దారుణ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆస్పత్రులలో కరోనా బాధిత కుటుంబాల దాడులు వెరసి వైద్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇక ఇలాంటి పరిస్థితులలో వైద్యులను ప్రాణాలను కాపాడే భగవంతులుగా గుర్తించి ప్రభుత్వాలు వారికి కావాల్సిన సదుపాయాలు , రక్షణ కల్పించాలి . వైద్యో నారాయణో హరి అన్న పదానికి నిజమైన అర్ధం చెప్తున్న వైద్యులను వారు చేస్తున్న పోరాటానికి కావలసిన చైతన్యం అందించాలి . వారికి మానసిక స్థైర్యాన్ని ఇస్తూ వారి సేవలను వినియోగించుకోవాలి తప్ప వారి మీద ఒత్తిడి పెట్టటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు .
Recommended Video