కరోనా ఎఫెక్ట్ : అమరావతిలో ఉద్యమాలు ఆపాలని దీక్షా శిబిరాలకు ప్రభుత్వం నోటీసులు- రేపు విరమణ
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్ నేపథ్యంలో అమరావతిలో ఆందోళనలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని కోరుతూ రైతులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పంపిన నోటీసులను పోలీసులు ఇవాళ దీక్షా శిబిరాల్లో అందజేశారు. రేపు జనతా కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో రైతులు దీక్షలు విరమించే అవకాశాలున్నాయి.
కరోనా ప్రభావం- అమరావతి ఉద్యమాలు..
ఏపీలో కరోనా వైరస్ మెల్లమెల్లగా తన ప్రతాపం చూపుతోంది. స్ధానిక ఎన్నికల వాయిదా నాటికి అంతగా ప్రభావం లేదని భావించినా తాజాగా మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అమరావతిలోని రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఉద్యమాలను కూడా ఆపాలని ఇవాళ నోటీసులు జారీ చేసింది. రాజధాని ఉద్యమంతో పాటు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న కౌంటర్ ఉద్యమకారుల దీక్షా శిబిరాలకు వెళ్లిన అధికారులు ఈ మేరకు దీక్షలు విరమించాలని కోరుతూ నోటీసులు అందజేశారు
ఉద్యమకారులకు అధికారుల విజ్ఞప్తి..
ఏపీలో విస్తరిస్తున్న కరోనా వైరస్ అమరావతిలోనూ ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాతో రాజధాని గ్రామాల్లో ఉద్యమాలకు విరామం ఇవ్వాలని నిన్న ఆరోగ్యమంత్రి ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా ఈ మేరకు ఉద్యమం విరమిస్తేనే మంచిదని వారికి సూచనలు చేశారు. అప్పటికీ వారు దీక్షా శిబిరాలను వీడకపోవడంతో ఇవాళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పంపిన నోటీసులను పోలీసులు అందజేశారు. రేపు జనతా కర్ఫ్యూ దృష్ట్యా దీక్షా శిబిరాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పోలీసులు ఆంక్షల అతిక్రమణ పేరుతో వారిని బలవంతంగా ఖాళీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.