ఏపీలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలే సేఫ్.. సత్ఫలితాలు ఇస్తున్న స్వయం నియంత్రణ చర్యలు..
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎవరైతే స్వయం నియంత్రణ పాటిస్తున్నారో వారే సేఫ్ గా ఉన్నట్లు ప్రభుత్వాలు వెలువరిస్తున్న గణాంకాలు, విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో తాజాగా ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం పట్టణాలు, నగరాలతో పోలిస్తే గ్రామాల్లో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తక్కువగా ఉంది. ఇందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.
పట్టణాలు, నగరాల్లో లాక్ డౌన్..
కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలోనూ లాక్ డౌన్ అమలవుతోంది. అయితే రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. ఉదయం నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు బయటికి వస్తున్న ప్రజలు.. పోలీసుల నియంత్రణ లేకపోతే ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వీరిలో ఏ ఒక్కరు కరోనా బాధితులు ఉన్నా మిగతా వారికి ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కనిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం రైతు బజార్లలో సైతం గళ్లు, క్యూలైన్ల విధానం అమలు చేస్తున్నా.. చాలా చోట్ల ప్రజలు వీటిని లెక్క చేయడం లేదు.
గ్రామాల్లో మాత్రం స్వయం నియంత్రణ..
పట్టణాలు, నగరాల్లో చదువుకున్న వారంతా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వైరస్ వ్యాప్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతుంటే పల్లెటూర్లలో ఉన్న నిరక్షరాస్యులు, కరోనా గురించి ఎక్కువ విషయాలు తెలియని వారు మాత్రం స్వయం నియంత్రణకు సిద్ధమవుతున్నారు. తమ గ్రామాల్లోకి బయటివారు రాకుండా కంచెలు, బైక్ లు, బండ్లు అడ్డుపెట్టి మరీ ఇతరులను అడ్డుకుంటున్నారు. బయటి వారు రావడం వల్ల తమ గ్రామంలోని వారికి వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న భయం వారిలో కనిపిస్తోంది.
ఇప్పటివరకూ గ్రామాలు సేఫ్..
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను పట్టించుకోకుండా పట్టణాల్లో, నగరాల్లో ప్రజలు ఉల్లంఘిస్తుంటే గ్రామీణ ప్రాంత ప్రజలు విజయవంతంగా స్వయం నియంత్రణ పాటిస్తున్నారు. ప్రభుత్వాల నియంత్రతో సంబంధం లేకుండా స్వయం నియంత్రణతో వారిని వారు కాపాడుకుంటున్నారు. దీని ప్రభావం కరోనా వైరస్ కేసులపైనా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేస్తున్న గణాంకాల్లో అనుమానిత కేసుల్లోనూ దాదాపుగా అన్నీ పట్టణాలు, నగరాలకే పరిమితం అవుతున్నాయి. దీంతో గ్రామాలు సేఫ్ గా ఉన్నాయన్న అంశాన్ని ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది.
Recommended Video
నాగరికులకు గ్రామీణుల మార్గదర్శనం..
పట్టణాలు, నగరాలతో పోలిస్తే గ్రామాల్లో ఇప్పటి వరకూ ఒకటీ అరా అనుమానిత కేసులు మాత్రమే నమోదయ్యాయి. పాజిటివ్ కేసులైతే పూర్తిగా నగరాలకే పరిమితమయ్యాయి. దీనికి కారణమైన స్వయం నియంత్రణ చర్యలను గ్రామాలు పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లోనూ వీటి అమలుపై ఒత్తిడి పెరుగుతోంది. ఓ రకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ స్వయం నియంత్రణతో పట్టణాలు, నగరాల్లోని విద్యావంతులకు సైతం మార్గదర్శనం చేస్తున్నట్లు కనిపిస్తోంది.