ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక సందేశం
ఆంధ్రప్రదేశ్ లో గురువారం మరో ఇద్దరు మరణించడంతో కొవిడ్-19 మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. అలాగే, కొత్తగా 15మందికి వైరస్ సోకడంతో పాజిటివ్ కేసులు సంఖ్య 363కు చేరింది. ఇప్పటిదాకా కృష్ణా(2), అనంతపురం(2), విశాఖపట్నం(1) జిల్లాలవారే చనిపోగా, తొలిసారి గుంటూరులోనూ ఓ మరణం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్ డౌన్ ఆదేశాలపై ప్రజల్ని మరోసారి అప్రమత్తం చేసింది. పైగా,
శుక్రవారం క్రైస్తవులకు పవిత్రదినమైన 'గుడ్ ఫ్రైడే' కావడం, ఆ వెంటనే ఈస్టర్ పండుగ ఉన్న నేపథ్యంలో క్రైస్తవులంతా ఇళ్లలోనే ప్రార్థనలు, వేడుకలు జరుపుకోవాలని సీఎం జగన్ సూచించారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడాలంటూ కరుణామయుడైన ఏసును ప్రార్థించాలని కోరారు. ఈ సందర్భంగా..''మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవే మానవాళికి జీసస్ సందేశాలు''అని జగన్ గుర్తు చేశారు.
అంతకుముందు, కేసుల వివరాలను వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ.. ఏపీలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత లేదని, కరోనా టెస్టుల విషయంలోనూ రాష్ట్రమే ముందంజలో ఉందని తెలిపింది. గురువారం కొత్తగా నమోదైన 15 పాజిటివ్ కేసుల్లో 11 మంది ప్రకాశం జిల్లాకు చెందినవాళ్లేనని, పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 363కాగా, మొత్తం 75 కేసులతో కర్నూలు మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా ఉంది. గుంటూరు (51), నెల్లూరు (48), ప్రకాశం (38), క్రిష్ణా (35) కేసులు నమోదయ్యాయి.