ఆ ఒక్క మహిళ వల్ల.. రాజమండ్రిలో పెరిగిన కేసులు.. కర్నూలు నుంచి గూడ్స్ రైల్లో..
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తద్వారా తమకే కాదు కాలనీల్లోని ప్రజల ప్రాణాలను కూడా రిస్క్లోకి నెట్టుతున్నారు. రెండు రోజుల క్రితం రాజమండ్రిలో కరోనా వైరస్ సోకిన ఓ వివాహిత(28) కూడా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆమె నిర్లక్ష్యానికి కుటుంబ సభ్యులతో పాటు అదే కాలనీలోని మరో ముగ్గురికి,ఓ ఆర్ఎంపీ వైద్యుడికి కూడా కరోనా సోకింది. వైరస్ సోకిన ఆ మహిళకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
కర్నూలు నుంచి గూడ్స్ రైల్లో రాజమండ్రికి
కర్నూలు నగరం నుంచి ఇటీవలే ఆ మహిళ గూడ్స్ రైలు ద్వారా రాజమండ్రికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న ఆ మహిళ.. ఆ విషయాన్ని దాచిపెట్టింది. చుట్టుపక్కలవాళ్లనూ కలిసింది. చివరకు జ్వరం తీవ్రం కావడంతో ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంది. అయితే ఆమెకు చికిత్స చేసిన ఆర్ఎంపీ వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. అతనితో పాటు ఆమె కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి,ఆ కాలనీలోని మరో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆ మహిళ ప్రైమరీ,సెకండరీ కాంటాక్ట్స్ను కూడా గుర్తించిక క్వారెంటైన్ చేసినట్టు సమాచారం.దీంతో రాజమండ్రిలోని మంగళవారం పేట,ఆవ రోడ్డు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు.
సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం.. ఆర్ఎంపీపై కేసు పెట్టే యోచనలో అధికారులు
జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రహస్యంగా ఆమెకు వైద్యం అందించిన ఆర్ఎంపీ వైద్యుడిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అధికారులు అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం మంగళవారం పేట,ఆవ రోడ్డు కాలనీల్లో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి దారులను మూసివేశారు. సమీపంలోని వారి బంధువులు,స్నేహితులు నిత్యావసరాలను కొనుగోలు చేసి బారికేడ్ల వద్దకు వచ్చి ఇచ్చి వెళ్తున్నారు.
ఇప్పటివరకూ 26 పాజిటివ్ కేసులు
ఇప్పటివరకూ తూర్పు గోదావరి జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు విశాఖలోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మరో 24 మంది రాజమండ్రిలోని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఎక్కువ కేసులు రాజమండ్రిలోనే నమోదవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో దాదాపు 13 ప్రాంతాల్లో రెడ్ జోన్లు కొనసాగుతున్నాయి. రెడ్ జోన్లకు ఈ నెల 3 వరకు ఎలాంటి మినహాయింపులు వర్తించవు. గ్రీన్ జోన్లలో మాత్రం వ్యవసాయం,వైద్యం,ఉద్యానవనం,ఆక్వా రంగాలకు మినహాయింపు ఉంటుంది. అలాగే ఉపాధి హామీ పనులు కూడా కొనసాగించవచ్చు. అలాగే ప్రభుత్వ నిర్మాణ పనులు కూడా కొనసాగించవచ్చు. అయితే స్థానిక కూలీలు,వలస కూలీలతోనే పనులు జరిపించాలి. ఇక అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మండల,డివిజన్ల పరిధిలోనే అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేశారు.
Recommended Video
రాష్ట్రవ్యాప్తంగా 647 కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా కర్నూలులో 158,గుంటూరులో 128,కృష్ణా జిల్లాలో 75,నెల్లూరులో 68,ప్రకాశంలో 44 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరు 65 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 17 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 565 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.