విజయవాడ కూరగాయలు నూజివీడూ వెళ్లాయట.. ఇప్పుడు అక్కడా భయం, భయం..
అది విజయవాడ రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్. నిత్యం వేల సంఖ్యలో జనం ఇక్కడకు వచ్చి కూరగాయలు కొనుక్కుని తీసుకెళుతుంటారు. అంతకు మించి విజయవాడ నగరానికి చుట్టు పక్కల ఉండే గ్రామాల్లో, పట్టణాల్లో చిన్నా చితకా వ్యాపారులు కూడా ఇక్కడి నుంచి కూరగాయలు తీసుకెళతారు. తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు కొంత నెమ్మదించినా, నిత్యావసరాలు కావడంతో అధికారులు అనుమతిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా రాజీవ్ గాంధీ మార్కెట్లో పనిచేస్తున్న కొందరు హమాలీలకు కరోనా సోకింది. దీంతో వీరిని ఆస్పత్రులకు పంపారు. అక్కడితో కథ ముగిసిపోలేదు..
రాజీవ్ గాంధీ మార్కెట్లో కూరగాయలు కొని తీసుకెళ్లి విజయవాడలో జనానికి పంచిన రాజకీయ నేతలంతా ఇప్పుడు భయం భయంగా గడుపుతున్నారు. వీరి నుంచి కూరగాయలు తీసుకున్న వాళ్ల పరిస్దితి కూడా అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. తాజాగా ఇదే మార్కెట్ నుంచి జిల్లాలోని నూజివీడు మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మిన ఓ వ్యాపారి పరిస్ధితి కూడా ఇదే రకంగా మారిపోయింది.
ఇతను అమ్మిన కూరగాయలు కొనుక్కున్న వారంతా భయంతో ఇళ్లు వదిలి రావడం లేదు. కొందరైతే స్వయంగా క్వారంటైన్ కు వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. పట్టణంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
కృష్ణాజిల్లా నూజివీడులో కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్. ప్రతిరోజు నూజివీడు నుంచి విజయవాడలోని రాజీవ్ గాంధీ హోల్సెల్ కూరగాయల మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తెచ్చి నూజివీడులో అమ్ముతున్న వ్యాపారి. ఇప్పుడు ఎంతమందికి వ్యాపారి ద్వారా వైరస్ స్ప్రెడ్ అయ్యోందనని ఆందోళన చెందుతున్న నూజివీడు వాసులు.