కరోనా వైరస్: కడప 49 మంది, నెల్లూరు నుంచి 68 మంది ఢిల్లీకి, తూ.గో జిల్లాలో ముగ్గురికి పాజిటివ్..
ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలు తెలుగురాష్ట్రాలను బెంబేలెత్తిస్తున్నాయి. సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో జనం హాజరవడం కారణమైతే.. ఏపీ, తెలంగాణలో వారిని గుర్తించి క్వారంటైన్కు తరలిస్తున్నారు. కడప జిల్లా నుంచి 49 మందిని క్వారంటైన్కు తరలించారు. వారంతా ఇటీవల ఢిల్లీ వెళ్లిరావడంతో నిర్బందంలో ఉంచారు.
కడపలో 49 మంది..
ప్రొద్దుటూరు, బద్వేల్, పులివెందుల, కడపకు చెందిన 49 మందిని అధికారులు గుర్తించారు. క్వారంటైన్కు తరలించారు. అయితే వారు ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరిని కలిశారు అనే అంశాలపై అధికారులు ఆరాతీస్తున్నారు. వారు ఏ రోజు ఎక్కడ ఉన్నారు, ఎవరిని మీట్ అయ్యారో కనుక్కొంటున్నారు. అయితే వారు కలిసిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నెల్లూరులో 68 మంది..
నెల్లూరు జిల్లాకు చెందిన 68 మంది కూడా ఢిల్లీ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. వారిలో 34 మంది నివేదికలు బుధవారం వస్తాయని అధికారులు చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. 43, 47 డివిజన్లలో ఎక్కువమంది సంచారించారనే సమాచారంతో రెడ్ జోన్గా ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయాలు ఇంటి వద్దకే సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
తూ.గోలో ముగ్గురికి పాజిటివ్
ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 26 మందికి పరీక్షలు నిర్వహించగా.. 23 మందికి నెగిటివ్, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఆ ముగ్గురు కాంటాక్ట్ అయిన వారిని అధికారులు గుర్తించారు. రాజమండ్రిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులు 16 మందితో కాంటాక్ట్ అయ్యారని తెలిపారు. వారిలో 8 మందిని గుర్తించామని వివరించారు.
61 మంది గుర్తింపు
కాకినాడలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఐదుగురు కుటుంబసభ్యులతో కాంటాక్ట్ అయిన 61 మందిని అధికారులు గుర్తించారు. పెద్దాపురంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులు ఆరుగురితోపాటు కాంటాక్ట్ అయిన 53 మందిని కూడా నోటిఫైడ్ చేశారు. కాకినాడలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులకు నెగిటివ్ వచ్చింది. జిల్లాలో మరో 68 మంది నివేదికలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో.. రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురంలో హై అలర్ట్ ప్రకటించారు.