ఏపీలో లాక్ డౌన్ వల్ల తగ్గిన నేరాలు.. కనిష్ఠానికి రోడ్డు ప్రమాదాలు!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ పలుచోట్ల నేరాలను గణనీయగా నియంత్రించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రహదారులపై జనం, వాహనాలు రాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గిపోగా... జనం కదలికల నియంత్రణ కారణంగా దొంగతనాలు, ఇతర నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన తాజా నివేదికలో ఏపీలో క్రైమ్ రేటు కనిష్టానికి చేరుకున్నట్లు తేలింది.
లౌక్ డౌన్ వల్ల తగ్గిన క్రైమ్..
కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా క్రైమ్ రేటు భారీగా తగ్గింది. ఈ ప్రభావం ఏపీలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం లాక్ డౌన్ తర్వాత నేరాల రేటు 33 నుంచి 55 శాతం మేర తగ్గిపోయినట్లు తేలింది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే, 33 నుంచి 55 శాతం మేరకు నేరాలు తగ్గాయని పోలీసు వర్గాలు తెలిపాయి. జనసంచారం లేకపోవడమే నేరాలు తగ్గడానికి ప్రధాన కారణమని, అన్ని ప్రాంతాల్లో పోలీసు గస్తీ సాగుతూ, నిఘా పెరగడం మరో కారణమని అధికారులు అంటున్నారు.
తగ్గిన రోడ్డుప్రమాదాలు..
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోడ్డు ప్రమాదాల గురించి, గతంలో ఏపీలో సగటున నిత్యమూ 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండగా, 18 మంది మృత్యువాత పడేవారు. మరో 60 మందికి గాయాలు అవుతుండేవి. మార్చిలో లాక్ డౌన్ మొదలైన తరువాత 140 రోడ్డు ప్రమాదాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. దీంతో పోలీసులకు సైతం వీటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం కూడా గణనీయంగా తగ్గిపోయింది.
తగ్గిన కిడ్నాప్ లు...
ఇక కిడ్నాపుల విషయానికి వస్తే, గతంలో రోజుకు 5 వరకూ రిజిస్టర్ కాగా, ఇప్పుడా సంఖ్య 2.5కు పడిపోయింది. 2018 లెక్కల ప్రకారం, రోజుకు 2.5 హత్యలు నమోదుకాగా, లాక్ డౌన్ తరువాత ఈ సంఖ్య 1.4కు తగ్గింది.
ఇక మార్చి నెలలో దోపిడీలు 1, రాబరీ 2, పగటి చోరీలు 2, రాత్రి పూట దొంగతనాలు 17, దొంగతనాలు 153, హత్యలు 14, అల్లర్లు 14, కిడ్నాప్ లు 24, లైంగిక దాడులు 8, గాయపరిచిన కేసులు 4, స్వల్ప దాడులు 260, మోసాలు 101, నమ్మక ద్రోహం 12, హత్యాయత్నాలు 18, తీవ్ర రోడ్డు ప్రమాదాలు 48, సాధారణ రోడ్డు ప్రమాదాలు 92, ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసులు 2,546లతో పాటు మరో 1,053 కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న ఉల్లంఘనలు..
ఇదే సమయంలో లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు మాత్రం పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై వివిధ జిల్లాల్లో 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
ఇక ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్) 2018తో పోలిస్తే ఐపీసీ సెక్షన్ల కింద సగటున నిత్యం 383 నేరాలు నమోదు కాగా, లాక్ డౌన్ సమయంలో నేరాల సంఖ్య 33 శాతం తగ్గింది. రోజుకు 254 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. వీటిల్లో అత్యధికం నిబంధనల ఉల్లంఘనలే.