ఖైదీల నెత్తిన బాంబు: రెండు తెలుగు రాష్ట్రాల్లో కఠిన నిర్ణయాలు అమలు: నేటి నుంచే..!
అమరావతి/హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లో క్రమంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి. దేశ చరిత్రలోనే ఎప్పుడూ తీసుకోనటువంటి నిర్ణయాలు అవి. ప్రఖ్యాతి చెందిన ఆలయాలను కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన పండుగలు, ఇతర శుభకార్యాలను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. నిత్యం సందర్శకులతో కళకళలాడే షాపింగ్ మాల్స్, సగటు ప్రేక్షకుడికి కనీస వినోదాన్ని అందించే సినిమా హాళ్లను మూతేసుకోవాల్సిన దుస్థితిని ఎదురైంది.
భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్: ఏడువేల మార్క్ దాటిన మృతుల సంఖ్య
ఖైదీలతో ములాఖత్ రద్దు..
అదే క్రమంలో- రెండు తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి కారాగారాల్లో శిక్షను అనుభవిస్తోన్న ఖైదీలతో కుటుంబ సభ్యుల ములాఖత్ను రద్దు చేశాయి. విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేశాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల జైళ్ల శాఖ జనరల్ డైరెక్టర్ కార్యాలయాలు వేర్వేరుగా ఉత్తర్వులను జారీ చేశాయి. ములాఖత్ రద్దు చేసినందుకు ప్రత్యామ్నాయంగా టెలిఫోన్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని కల్పించాయి. అది కూడా పరిమితంగానే. వారంలో నాలుగుసార్లు మాత్రమే ఖైదీలు.. తమ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడే వెసలుబాటును తీసుకొచ్చాయి.
అన్ని కేంద్ర కారాగారాలతో పాటు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్ర కారాగారాలతో పాటు ఉప కారాగారాల్లోనూ ఈ విధానం అమల్లోకి వచ్చింది. రాజమహేంద్రవరం, కడప, చర్లపల్లి, చంచల్గూడ కేంద్ర కారాగారాల్లో బుధవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి తీసుకుని వచ్చారు అధికారులు. నిజానికి-ములాఖత్ సమయంలో ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, లేదా బంధువుల మధ్య ఓ ఫైబర్ గ్లాస్ అడ్డుగా ఉంటుంది. చేతుల కలుపుకొనే అవకాశం కూడా తక్కువే. అయినప్పటికీ.. కారాగారాల్లో ఏ ఒక్క ఖైదీకయినా ఈ వైరస్ సోకిందంటే.. మిగిలిన వారందరికీ సులువుగా వ్యాపించే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Recommended Video
ఇప్పటిదాకా మాస్క్లతో..
కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటిదాకా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. వివిధ నేరాలకు పాల్పడి కేసులను ఎదుర్కొంటున్న ఖైదీలను 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన తరువాత బ్యారక్లల్లోకి పంపించారు. విచారణలో భాగంగా వారిని న్యాయస్థానాల ముందు హాజరు పర్చడానికి తీసుకెళ్లే సమయంలో ముందుజాగ్రత్త చర్యలను పాటించారు. ములాఖత్ విషయంలోనూ ఆంక్షలు విధించారు. తాజాగా- కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం ములాఖాత్లనే రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేశారు.