CM Jagan on Coronavirus: క్రమశిక్షణతోనే జయిద్దాం, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదు..
కరోనా మహమ్మారిని క్రమశిక్షణతోనే జయిద్దామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి అని.. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని కోరారు. నిన్న సరిహద్దు వద్ద జరిగిన ఘటనలు బాధ కలిగించాయని.. అయినా 200 మందిని తీసుకొని క్వారంటైన్కు తరలించామని పేర్కొన్నారు. వారిని నేరుగా ఇంటికి పంపించే పరిస్థితి లేదని.. ఎందుకంటే వారు ఎవరిని కలిశారో, ఎంతమందితో కాంటాక్ట్ ఉన్నారో తమకు తెలియదు కదా అన్నారు.
200 మందిని తీసుకున్నాం..
లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని సీఎం జగన్ కోరారు. ఆంధ్రా సరిహద్దు వరకు వచ్చినందున గరికపాడు వద్ద 44 మంది, కందుకూరు వద్ద 152 మందిని మొత్తం 200 మందిని తీసుకున్నామని వివరించారు. సొంత రాష్ట్రానికి వచ్చేవారిపై ఆంక్షలు బాధ కలిగిస్తోందని.. చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదని.. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తప్పడం లేదన్నారు. వారిని 14 రోజుల క్వారంటైన్ తర్వాత స్వస్థలాలకు తరలిస్తామని చెప్పారు. ఎక్కడివారు అక్కడే ఉండిపోతే తప్ప వ్యాధిని నిర్మూలించలేం అని జగన్ స్పష్టంచేశారు.
కేసీఆర్ ఆప్యాయత..
తెలంగాణలో ఉన్న ఏపీ వారిని ఆదుకుంటామని, ఆశ్రయం కల్పించి, భోజన సదుపాయం ఏర్పాటుచేస్తామని సీఎం కేసీఆర్ ఆప్యాయంగా చెప్పారని తెలిపారు. గురువారం కూడా దాచేపల్లి, నాగార్జునసాగర్, పొందుగూరు చెక్ పోస్ట్ వద్ద కొందరు వచ్చారని.. వారు ఆయా ప్రాంతాల్లో ఉండిపోవాలని జగన్ సూచించారు. ప్రదేశం మారితే వారు ఎవరితో మాట్లాడతారు, ఇదివరకు ఎంతమందితో కాంటాక్టులో ఉన్నారనే అంశంపై స్పష్టత ఉండదన్నారు. దీంతో చికిత్స అందించడం మరింత కఠినమవుతోందని చెప్పారు. ఇతర రాష్ట్రమే కాదు జిల్లా, గ్రామం కూడా దాటొద్దని సూచించారు.
సరిహద్దులు క్లోజ్..
ఏపీకి వచ్చే సరిహద్దులను మూసివేస్తున్నామని సీఎం జగన్ స్పష్టంచేశారు. చెక్పోస్టులను దాటి ఎలాగోలా ఇంటికి చేరితే మీ కుటుంబసభ్యులకే ప్రమాదం అని చెప్పారు. దేవుని దయ వల్ల రాష్ట్రంలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. వారికి చికిత్స అందజేసి వ్యాధిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోకి 27 వేల 819 మంది విదేశాల నుంచి వచ్చారని.. వారందరికీ పరీక్షలు జరిపామని సీఎం వివరించారు. ఆపత్కాలంలో వైరస్ను నిర్మూలించేందుకు పాటుపడుతున్న గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ను సీఎం జగన్ అభినందించారు.
400 పడకలతో ఆస్పత్రి..
రాష్ట్రంలో నాలుగుచోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం జగన్ వివరించారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైతే 86 శాతం నయం అవుతోందని తెలిపారు. 14 శాతం మాత్రమే ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాల్సి వస్తుందన్నారు. 4 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అవసరమవుతోందని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం 400 బెడ్లతో ఐసీయూ ఏర్పాటు చేశామని జగన్ వివరించారు. నాలుగు చోట్ల కరోనా వైరస్కు మాత్రమే చికిత్స అందజేస్తామన్నారు.
హెల్ప్లైన్ నంబర్
వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో 1902 అనే హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. తమకు ఎలాంటి అసౌకర్యం కలిగిన వెంటనే డయల్ చేయాలని సూచించారు. ఐఏఎస్ అధికారులతోపాటు.. ముగ్గురు మంత్రులు కూడా కంట్రోల్ రూంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను మంత్రులు తెలుసుకొని హెడ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో సరకు రవాణా చేసే వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు.
ఆందోళన వద్దు..
నిత్యావసర సరుకులు అవసరానికి మించి ఉన్నాయని.. అయిపోతాయని ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చి సరుకులు కొనుగోలు చేయొచ్చు అన్నారు. రైతులు వ్యవసాయం చేయాలని.. కానీ సోషల్ డిస్టన్స్ మాత్రం ముఖ్యం అని వివరించారు. బియ్యం, పప్పు దినుసులు ఈ నెల 29 నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్ 4 నుంచి ప్రతీ ఇంటికి రూ.వెయ్యి డోల్ డెలివరీ చేస్తామని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, విద్యుత్ సిబ్బంది ప్రతి ఇంటికీ వచ్చి విధులను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని, వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.