అనంతపురంలో కరోనా వైరస్: రష్యా నుంచి వచ్చిన పర్యాటకుడిలో: అతని ట్రావెల్ హిస్టరీ ఇదీ..!
అనంతపురం: నెల్లూరు జిల్లాను వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ జాడలు.. తాజాగా అనంతపురంలో కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. రష్యా నుంచి వచ్చిన 32 సంవత్సరాల పర్యాటకుడిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే అతణ్ని పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకు తరలించారు. అతనికి చికిత్స అందిస్తున్నారు. ఆ పర్యాటకుడి రక్తనమూనాలను సేకరించి తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఙాన సంస్థ (స్విమ్స్)కు తరలించారు.
బలపరీక్ష లేకుండానే: కమల్నాథ్ సర్కార్ను కాపాడిన కరోనా వైరస్: 26 వరకు..!
కరోనా వైరస్ సోకిన దేశాల్లో పర్యటన..
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించడానికి సంవత్సరం పొడవునా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులకు తరలి వస్తుంటారు. రష్యా నుంచి ఓ పర్యాటకుడు రెండురోజుల కిందటే పుట్టపర్తికి వచ్చారు. అంతకుముందు అతను మలేషియా, థాయ్లాండ్లల్లో పర్యటించారు. అనంతరం కేరళలో కొన్ని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.
కేరళ, బెంగళూరు మీదుగా పుట్టపర్తికి..
కేరళ పర్యటన ముగించుకున్న ఆ రష్యన్.. బెంగళూరు మీదుగా పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మరుసటిరోజే తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అతణ్ని పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక లక్షణాల ఆధారంగా కరోనా వైరస్ సోకినట్టుగా డాక్టర్లు అనుమానిస్తున్నారు.
స్విమ్స్కు రక్తనమూనాలు..
అతని ట్రావెల్ హిస్టరీ కూడా దీన్నే రుజువు చేస్తోందని వెల్లడించారు. ఆ రష్యన్ పర్యటించిన దేశాలు, మనదేశంలోని కేరళ, బెంగళూరుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. అతను ఈ మహమ్మారి బారిన పడి ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అతని రక్త నమూనాలను స్విమ్స్కు పంపించామని, అక్కడి నుంచి నివేదిక అందాల్సి ఉందని తెలిపారు. నెగెటివ్గా వచ్చినప్పటికీ.. 14 రోజుల తరువాతే.. అతణ్ని బయటికి పంపిస్తామని తెలిపారు.
సత్యసాయి మహాసమాధి దర్శనంపై ఆంక్షలు..
ఈ నేపథ్యంలో సత్యసాయిబాబా ట్రస్ట్, అప్రమత్తమైంది. ప్రస్తుతం పుట్టపర్తిలో ఉన్న విదేశీ భక్తులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలను నిర్వహిస్తోంది. వారి వివరాలను సేకరిస్తోంది. సత్యసాయిబాబా మహా సమాధిని ఎవరూ తాకరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించడానికి వచ్చే విదేశీ భక్తుల రాకపైనా నిషేధాన్ని విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ ఆంక్షలు కొనసాగిస్తామని చెబుతున్నారు.