ఏపీలో 303కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాల్లోనే అత్యధికం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 303కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.
కాగా, రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబసభ్యులే ఉన్నారు. రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన కరోనావైరస్ పరీక్షలో కొత్తగా కర్నూలు జిల్లాలో 18 కరోనా కేసులు, నెల్లూరులో 8, పశ్చిమగోదావరిలో 5, కడపలో 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఇక మొత్తం జిల్లాల వారీగా చూస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా కర్నూలులో 74 నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరులో 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27, ప్రకాశం 24, పశ్చిమగోదావరి 21, విశాఖపట్నం 20, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, అనంతపురం 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా నిర్ధారణ పరీక్షల కోసం విశాఖపట్నంలో వైరల్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నంతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వైరల్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇక తెలంగాణలోనూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 364 కేసులు నమోదయ్యాయి.
ఇక మనదేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4281కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 319 మంది కోలుకున్నారు. 111 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గత 24 గంటల్లో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు, 28 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.