ఏపీలో ‘ఢిల్లీ’ కలకలం: 44కు చేరిన పాజిటివ్ కేసులు, జిల్లాల వారీగా కేసులు ఇలా, వారంతా రిపోర్టు చేయాలి
అమరావతి: కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన 4 కేసులతోపాటు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరుకుంది.
జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా..
ఇక జిల్లాల వారీగా పరిశీలించినట్లయింతే.. ప్రకాశంలో 11, విశాఖపట్నంలో 10, గుంటూరులో 9, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలిపింది. సోమవారం రాత్రి మొత్తం 256 మంది నమూనాలను పరీక్షించగా వారిలో 21 పాజిటివ్, 235 మందికి నెగిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వం వెల్లడించింది.
వారిని గుర్తించాలంటూ జగన్..
కాగా, కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర దేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన కుటుంబాలను నిత్యం పరిశీలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారిని గుర్తించేందుకు సర్వే కొనసాగించాలన్నారు.
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితోనే ఆందోళనకర వాతావరణం
కొత్త కేసుల్లో చాలా మంది ఢిల్లీ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చినవారే ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ఆరోగ్య వివరాలు వెల్లడించాలని, వాళ్లు ముందుకు రాకపోతే వారి కుటుంబసభ్యులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఎం చెప్పారు. ప్రజల బాగు కోసమే సర్వే జరుగుతోందని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరికి కరోనా లక్షణాలున్న వెంటనే ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు చాలా మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో చేరకపోవడం, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణానికి దారితీసింది.