గుంటూరు జిల్లాలో అంచనాలకు మించిపోయిన కరోనా అనుమానితులు, జాబితాలో పలువురు ఎమ్మెల్యేలు !
ఏపీలో నిన్న మొన్నటి వరకూ ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాని గుంటూరు జిల్లా ఇప్పుడు ఆ పేరు చెబితేనే వణుకుతోంది. దీనికి కారణం గుంటూరు నగరానికి చెందిన ఎమ్మెల్యే బావ మరిది ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను 500 మందికి విందు ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొన్న వారు మరిన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఇప్పుడు వీరందరినీ గుర్తించి క్వారంటైన్ చేసే పనిలో అధికారులు రాత్రీపగలు శ్రమిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకూ సేఫ్..
ఏపీలో కరోనా వైరస్ అనుమానిత కేసులు రావడం మొదలై రెండు వారాలవుతోంది. కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న విజయవాడ, విశాఖతో పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతికే ఇవి పరిమితమయ్యాయి. కానీ తాజాగా ఇవి గుంటూరు జిల్లాకు కూడా విస్తరించాయి. అయితే మిగతా జిల్లాల నుంచి కరోనా ప్రభావం గుంటూరుపై పడలేదు. స్ధానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడొకరు ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరై రైల్లో విజయవాడ వచ్చి అక్కడి నుంచి గుంటూరులోని ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత భయాలు మొదలయ్యాయి.
ఢిల్లీ నుంచి వచ్చాక పార్టీలు, విందులు, ప్రార్ధనలు..
ఢిల్లీ నుంచి గుంటూరు తరలివచ్చిన సదరు ఎమ్మెల్యే బావమరిది స్ధానికంగా ఉన్న మంగళ్ దాస్ నగర్ లో 500 మంది సన్నిహితులు, స్నేహితులకు భారీ విందు ఏర్పాటు చేశాడు. ఇందులో తన బావతో పాటు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఆ విందు ముగిసిన రెండ్రోజుల తర్వాత సదరు వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో విజయవాడ తీసుకొచ్చి క్వారంటైన్ లో ఉంచారు. కానీ అక్కడితో కథ ముగిసిపోలేదు. అతను ఇచ్చిన విందులో పాల్గొన్న వారు జిల్లాలో విచ్చలవిడిగా తిరిగేశారు.
ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ..
ఎమ్మెల్యే బామ్మర్ది ఇచ్చిన పార్టీకి హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లాలో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. మరికొందరు ఏకంగా మసీదుల్లో ప్రార్ధనలకు కూడా హాజరయ్యారు. ఇదంతా సదరు కరోనా పాజిటివ్ బాధితుడికి రోగం బయటపడిన తర్వాతే జరగడం ఇంకా దారుణం. తమకెందుకు వస్తుందన్న నిర్లక్ష్యంతో పోలీసులు, ఇతర అధికారులు వారిస్తున్నా వినకుండా తాజాగా గుంటూరు జిల్లా తాడికొండలోని ఓ మసీదులో ప్రార్దనలకు కూడా వీరు హాజరయ్యారు. దీంతో సదరు ప్రార్ధనల్లో పాల్గొన్న వారందరినీ క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Recommended Video
పరిస్ధితి ఎక్కడి కెళుతుందో తెలియక..
కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి ఇచ్చిన భారీ విందుకు హాజరవడమే ఓ తప్పయితే ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాలకు కూడా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా తిరిగిన వారిని గుర్తించడం ఇప్పుడు అధికారులకు కష్టతరంగా మారిపోయింది. అనధికారిక అంచనా ప్రకారం ఓ వంద మంది వరకూ కరోనా సంబంధిత లక్షణాలతో ఇవాళ ఒక్కరోజే ఆస్పత్రుల్లో చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్న వారిలో చాలా మంది నేరుగా కాంటాక్ట్ అయ్యారు. ఆలింగనం చేసుకున్నారు. భుజాలు రాసుకుంటూ తిరిగారు. ఇప్పుడు అధికారుల సూచన మేరకు స్వచ్చందంగా క్వారంటైన్ కు రమ్మంటే మాత్రం నిరాకరిస్తున్నారు. దీంతో వీరిని ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు నిన్న అర్దరాత్రి వరకూ ప్రయత్నాలు చేసి వెనుదిరిగారు. వీరు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం జిల్లాలో కరోనా కేసులు రాష్ట్రంలోనే రికార్డు సృష్టించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.