కరోనా వైరస్: ఏపీలో కూడా ముగ్గురి మృతి..? భార్య, భర్త సహా వృద్దుడు, ఇతర కారణాల వల్లేనని..?
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న ఆరుగురు కరోనా వైరస్తో మృతిచెందడం కలకలం రేపుతోంది. శనివారం నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కూడా చనిపోయిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమై హాజరైన వారి వివరాలు సేకరించారు. మిగతా ఐదుగురి వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భారీగా వెళ్లడంతో.. వారు ఎవరెవరితో కలిశారు. వారి పరిస్థితిపై అధికారులు ఆరాతీస్తున్నారు.
ఏపీలో ముగ్గురు..?
ఇటు ఏపీలో కూడా ముగ్గురు చనిపోయారు. వారు ఇటీవల ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు కావడం విశేషం. కానీ ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. వారు ఇతర కారణాలతో చనిపోయి ఉంటారని కొట్టిపారేస్తున్నారు. కానీ ముగ్గురు చనిపోయారని.. వారు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారనే అంశం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.
భార్య, భర్త మృతి..?
విజయవాడకు చెందిన మహిళ ఆదివారం చనిపోయారు. ఆ మరునాడు సోమవారం ఆమె భర్త మృతిచెందారు. వీరిద్దరూ ఇటీవల ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి రావడంతో కరోనా వైరస్ సోకి చనిపోయారా అనే అనుమానం కలుగుతోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కాతేరుకు చెందిన వృద్దుడు కూడా సోమవారం రాత్రి చనిపోయాడు. ఇతనికి ఆదివారం కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఎందుకైనా మంచిదని 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్న తర్వాత మళ్లీ పరీక్షలు చేస్తామని వైద్యులు ప్రకటించారు. కానీ సోమవారం రాత్రి వృద్దుడు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రిపోర్టులో కరోనా లేదని తేలిన.. రాత్రికి రాత్రే చనిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ముగ్గురికి కరోనా వైరస్ సోకిందా అని అనుమానిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం అదేం లేదని చెప్పడాన్ని కూడా సస్పెక్ట్ చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణ
జమాత్కు తెలుగురాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఏపీలో 50 మంది వరకు, తెలంగాణలో 40 మంది వెళ్లినట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అతను ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. అతను ఎవరితో సన్నిహితంగా మెలిగాడు, కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేశారు. అతనితోపాటు మరో 39 మంది కూడా నిజామాబాద్ జిల్లా నుంచి సమావేశానికి హాజరైనట్టు తెలిసింది. వారిని పరీక్షించిన ఆర్ఎంపీ డాక్టర్ సహా 40 మంది రక్త నమునాలను గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఎందుకైనా మంచిదని 25 మందిని క్వారంటైన్కు తరలించారు. మరో 15 మంది ఆచూకీ కనుగొనేందుకు రంగంలోకి దిగారు.
అన్వేషణ..
ఏపీలో కూడా జమాత్కు వెళ్లిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 11 మందిని అధికారులు గుర్తించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా సోదాలు కొనసాగుతోన్నాయి. విజయనగరంలో 12 మందిని, రాజమండ్రిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఉరవకొండ, వజ్రకరూర్కి చెందిన ఐదుగురిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
Recommended Video
వెలుగులోకి ఇలా..
నాంపల్లికి చెందిన వృద్దుడి మరణంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. మార్చి 14వ తేదీన అతను జమాత్ కోసం ఢిల్లీ వెళ్లాడు. అక్కడే మూడురోజుల పాటు ఉండి.. 17వ తేదీన హైదరాబాద్ వచ్చాడు. ఇంటికి తిరిగొచ్చాక జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. కానీ కరోనాకు సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో అతను శనివారం చనిపోయాడు. తర్వాత వైద్యులకు అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వెంటనే అతని కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్లో ఉంచారు.