'పుష్కరాల్లో రూ. కోట్లలో అవినీతి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా'
రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని అందరూ అనుకుంటుంటే కాదు పుష్కరాల్లో రూ. కోట్లలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో రూ. కోట్లలో అవినీతి జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, శాసనమండలి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. శానిటేషన్, బ్లీచింగ్, మొక్కలు కొనుగోలులాంటి పనుల్లో రూ.3 కోట్లు స్వాహా చేశారని ఆయన పేర్కొన్నారు.
12 రోజుల పాటు జరిగిన గోదావరి మహా పుష్కరాలు శనివారంతో సాయంత్రం 6.38 నిమిషాలతో ముగిసిన సంగతి తెలిసిందే. పుష్కరాలు ముగింపు రోజున గోదావరి తీర ప్రాంతం జనసందోహంతో పుష్కరఘాట్లు కళకళలాడాయి.
పుష్కరాలు మొదలైన నాటి నుంచి శనివారం ముగింపు రోజు వరకు భారీ ఎత్తున యాత్రికులు పుష్కరాలకు తరలివచ్చి భక్తిశ్రద్దలతో పుష్కర స్నానాలు ఆచరించి గోదారమ్మకు మొక్కులు సమర్పించారు. 114సంవత్సరాలకోసారి వచ్చే మహా పుష్కర సంరంభం భక్తుల కోలాహాలంతో గోదావరి తీర ప్రాంతమంతా పులకించిపోయింది.
రాజమండ్రిలోని పుష్కరఘాట్లో ముగింపు వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇక పుష్కరాల ముగింపు వేడుకలు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగాయి. ఈ వేడుకలో వెయ్యిమంది కూచిపూడి కళాకారులతో నిర్వహించనున్న నృత్యరూపకం భక్తులను అలరించింది.
ప్రముఖ సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలబురళీకృష్ణచే కర్ణాటక గాత్ర సంగీతం కార్యక్రమాలు నిర్వహించారు.