ఎసిబి వలలో అవినీతి తిమింగలాలు:చిరుద్యోగులే అయినా కోట్లకు పడగలెత్తారు...
అనంతపురం,విశాఖ:ఎపిలో మంగళవారం ఎసిబి జరిపిన దాడుల్లో ఇద్దరు అవినీతి సామ్రాట్ లు దొరికిపోయారు. అయితే వీల్లు రాష్ట్రానికి ఒకరు ఉత్తరాన...మరొకరు దక్షిణాన ఉన్నా ఈ అక్రమార్కుల మధ్య ఉన్న సారూప్యత...చేతివాటం...టాలెంట్ చూసి ఎసిబి అధికారులే విస్తు పోయారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ శాఖలో వీరిద్దరూ చిరుద్యోగులే...అయితేనేం అవినీతి దందాలో మాత్రం కింగ్ లు...ఆ విధంగానే ఇళ్లు, స్థలాలు, విలువైన ఆభరణాలు, వాహనాలు... ఇలా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను అవలీలగా కూడబెట్టేశారు. అంతేనా మాకు నిబంధనలేంటీ అనే చందంగా రూల్స్ కు విరుద్దంగా దశాబ్దాల తరబడి ఒకే చోట పాతుకుపోయి మరీ ఉద్యోగం చేసేస్తున్నారు. ఇంతకీ వీరెవరంటే...ఇందులో ఒకరు రవాణా శాఖ కానిస్టేబుల్ నల్లపరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి కాగా మరొకరు కెజిహెచ్ సీనియర్ అసిస్టెంట్, విశాఖ జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు.
ఈ కానిస్టేబుల్...స్టైలే వేరు
అనంతపురం జిల్లా గుంతకల్లులోని మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయంలో కానిస్టేబుల్ రవీంద్రనాథ్రెడ్డి ఇంటిపై మంగళవారం ఎసిబి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 17 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులు బయటపడినట్లు అంచనా. రవీంద్రనాథ్రెడ్డికి అనంతపురం నడిబొడ్డున జీసస్నగర్లో 10 సెంట్ల స్థలంలో ఇంద్రభవనంలాంటి ఇల్లు ఉంది. మూడు పడక గదులతో సువిశాలంగా కట్టుకున్న కింది అంతస్తులోనే అతడు నివాసం ఉంటున్నాడు. లోపలికెళ్తే అదిరిపోయే ఇంటీరియర్ వర్క్. మూడు పడక గదులు. ఎటు చూసినా అంతా విలువైన వస్తు సామగ్రే. స్నానాల గదిలో విలాసవంతంగా స్నానం చేసేందుకు అత్యాధునికమైన ఓ తొట్టె. ఇంటి ప్రహరీ లోపలే లాన్.. ఇవన్నీ అతడి వైభోగాన్ని సూచించేందుకు క్లుప్తమైన వివరాలు. కింది అంతస్తులో నివాసం ఉంటూ మొదటి అంతస్తులో రెండు వాటాలను అద్దెకిచ్చాడు.
మరిన్ని ఆస్థులు...గతంలో కూడా దాడులు
అనంతపురంలోని జీసస్నగర్లో రవీంద్రనాథ్ ఇంటితోపాటు, తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరులో అతడి బంధువులు, గుంతకల్లులోని అతడు పనిచేస్తున్న కార్యాలయంలో అనిశా అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇంటి స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూములు, బంగారం, వెండి తదితరాలన్నీ కలిపి దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని లెక్కించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.17 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. రవీంద్రనాథ్రెడ్డి 1990లో విధుల్లో చేరగా అప్పటి నుంచి కానిస్టేబుల్గానే అనంతపురం జిల్లాలోని వివిధ ఎంవీఐ కార్యాలయాల్లో పని చేస్తున్నాడు. సోదాల్లో బయటపడిన ఆస్తుల్లో అత్యధికంగా అతడి భార్య అరుణ పేరిట ఉన్నాయి. ఆమెకు మొత్తం కేజీ బంగారం ఉంది. 3.5 కేజీల వెండి వస్తువులు ఉన్నాయి. మరోవైపు రవీంద్రనాథ్ పెనుకొండలోని ఆర్టీవో చెక్పోస్ట్లో గతంలో పనిచేసినప్పుడు అనిశా అధికారులు రెండుసార్లు ఆకస్మిక దాడులు చేయగా...అక్కడ ఎక్కువ మొత్తంలో డబ్బు పట్టుబడగా...అప్పుడు విధుల్లో ఉన్న అతడిపై నమోదైన కేసులు ఇప్పటికీ అవి విచారణ దశలోనే ఉండటం విశేషం.
ఈయన...స్టైల్ ఇది
మరోవైపు విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి కేజీహెచ్లో సీనియర్ అసిస్టెంట్, విశాఖ జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు ఇంటిపైన ఎసిబి అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా సుమారు రూ. 7 కోట్లకు పైగా మార్కెట్ విలువున్న ఆస్తులను కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 1986లో జూనియర్ అసిస్టెంట్గా చేరిన అతడు తన 30 ఏళ్ల సర్వీసులో అత్యధిక కాలం కేజీహెచ్ ఔషధాల కొనుగోళ్ల విభాగంలోనే పనిచేశాడు. ప్రస్తుత ఒకే పోస్టులో 20 ఏళ్లుగా ఉన్నాడు. కేజీహెచ్తోపాటు ఎంవీపీ కాలనీలోని సెక్టార్-3లో ఉన్న అతడి ఇల్లు, విశాఖలోని సోదరుడి ఇల్లు, ఇరిగేషన్ ఉద్యోగుల త్రిఫ్ట్ సొసైటీ కార్యాలయం, నర్సీపట్నం, యలమంచిలి తదితర ఎనిమిదిచోట్ల ఏక కాలంలో దాడులు చేశారు.
అక్రమ సంపాదన...అవినీతి ఇలా
ఇతడికి ఎంవీపీ కాలనీలోని సెక్టార్-3లో ఉన్న ఇల్లుతో పాటు విశాఖ లోనే 950 చదరపు అడుగుల ఫ్లాటు, ఎంవీపీ కాలనీలో మరదలు రామలక్ష్మి పేరుతో రెండతస్తుల ఇల్లు, భార్య సత్యవాణి పేరుతో నర్సీపట్నంలో ఒక ఇల్లు, 375 చదరపు గజాల స్థలం, ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంలో 1.40 ఎకరాల పొలం, నక్కపల్లిలో 1.62 ఎకరాల పొలం, కుమార్తె కె. దేవి పేరుతో యలమంచిలిలో 85 సెంట్ల పొలం, ఇథియోస్ కారు తదితరాలున్నట్టు అధికారులు తెలిపారు. ఆయా ఆస్తుల పుస్తక విలువ రూ.1.40 కోట్లుగా తేలింది. ఇక గత ఎనిమిదేళ్లుగా గుంటూరుకు చెందిన జైకృష్ణ ఏజెన్సీస్ అనే సంస్థే కేజీహెచ్కు ఔషధాల సరఫరా టెండర్లు దక్కించుకోవడం వెనక ఈశ్వరరావు సహకారమే కారణమనేది ఇతడిపై వచ్చిన ప్రధాన ఆరోపణల్లో ఒకటి. ఈ క్రమంలో సీతమ్మధార కెనరా బ్యాంకులో ఇతడికి లాకర్ ఉన్నట్లు నిర్ధారణ అవ్వడంతో బుధవారం దాన్ని తెరవాలని అనిశా అధికారులు భావిస్తున్నారు.