ఆక్సీజన్ లా మారిన అవినీతి..! రైల్వే ఆస్పత్రుల్లో శ్రుతిమించిన దందాలు..!!
విజయవాడ: విజయవాడ రైల్వే ఆస్పత్రిలో లొసుగులు బయటకు వస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న గోల్మాల్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రిఫరల్ ఆస్పత్రులుగా వ్యవహరిస్తున్న పలు కార్పొరేట్ హాస్పిటల్స్కు ఎక్సెస్ పేమెంట్లు చేసినట్టు విజిలెన్స్ తనిఖీల్లో తేలినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు రైల్వే హాస్పిటల్పై జరిపిన ఆకస్మిక దాడుల్లో కీలకమైన బిల్స్లో లొసుగులు కనిపించినట్టు సమాచారం. విజిలెన్స్ అధికారులు రెండు రోజులు పరిశీలించి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. నగరానికి చెందిన రెండు కార్పొరేట్ హాస్పిటల్స్కు బిల్లులు అదనంగా చెల్లించేసినట్టు తెలుస్తోంది. రైల్వే శాఖకు ఇంటి దొంగలు భారీ నష్టాన్నే కలిగించినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ పూర్తైన తర్వాత కానీ, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రైల్వే హాస్పిటల్స్..! రిఫరల్ ఆస్పత్రుల మాటున అవినీతి..!!
రైల్వే ఉద్యోగ, కార్మికులకు వైద్య సదుపాయాలు అందించడానికి రైల్వే శాఖ ప్రత్యేకంగా హాస్పిటల్స్ను నడుపుతోంది. రైల్వే హాస్పిటల్స్లో మొదట్లో అత్యాఽధునిక వైద్యం అందించేవారు. స్పెషలిస్టు వైద్యులు, ఎక్విప్మెంట్ కూడా ఉండేది. కాల క్రమంలో కేంద్ర ప్రభుత్వం రిఫరల్ హాస్పిటల్స్కు కూడా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. రైల్వే శాఖ కూడా తమ ఆస్పత్రుల పరిధిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి వీలుగా కార్పొరేట్ హాస్పిటల్స్ను ‘రిఫరల్'గా తీసుకుంటోంది. విజయవాడ డివిజన్ పరిధిలో మొత్తం ఏడు రైల్వే హాస్పిటల్స్ ఉన్నాయి.
రైల్వే ఆస్పత్రిలో లొసుగులు..! పట్టించుకునే నాథుడే ఉండడన్న ధీమా..!!
వీటిలో ప్రధానమైనది విజయవాడ హాస్పిటల్. విజయవాడ డివిజన్ పరిధిలో మొత్తం 18 రిఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 13 రిఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. రిఫరల్ హాస్పిటల్స్గా నగరంలోని వివిధ స్పెషలిస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. రిఫరల్ ఆస్పత్రులుగా తీసుకునే ముందు రైల్వే మెడికల్ విభాగం, కార్పొరేట్ హాస్పిటల్స్ మధ్యన ఒక ఎంఓయూ జరుగుతుంది. అప్పటి నుంచి రిఫరల్ హాస్పిటల్స్లో తీసుకునే వైద్య సదుపాయాల బిల్లులు క్లెయిమ్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎంఓయూ ఇలా ఉంటుంది..! రిఫరల్ ఆస్పత్రులకు ఎక్సెస్ పేమెంట్తో బిల్లుల చెల్లింపు..!!
రైల్వే మెడికల్ విభాగం, రిఫరల్ హాస్పిటల్స్తో చేసుకునే ఎంఓయూ కేంద్ర ప్రభుత్వ వైద్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) ప్రకారం ఎంఓయూ జరగాలి. రిఫరల్ హాస్పిటల్స్ ఏ సేవకు ఎంత చార్జి చేయాలి.. ఏ పరీక్షకు ఎంత తీసుకోవాలి.. ఏ చికిత్సకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే.. ఎంత మేర చార్జీ చేయాలి.. మందులకు ఎంత చార్జి చేయాలి.. ఇలా సమగ్రంగా సీజీహెచ్ఎస్లో పొందు పరిచి ఉంటుంది. సీజీహెచ్ఎస్ నిబంధనల మేరకే చెల్లింపులు చేయడానికి రైల్వే మెడికల్ విభాగం అంగీకరిస్తూ పరస్పరం ఎంఓయూ చేసుకోవాలి.
సీజీహెచ్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఎంఓయూ..! వాటి విలువ కోట్లలోనే..!!
రైల్వే హాస్పిటల్లో సీజీహెచ్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఎంవోయూలు చేసుకున్నట్టు విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసినట్టు తెలుస్తోంది ఒక్కో హాస్పిటల్కు ఒక్కో విధంగా ఎంఓయూలు జరిగినట్టు సమాచారం. ఇలా సీజీహెచ్ఎస్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఒప్పందం కుదుర్చుకోవడమే పెద్ద తప్పు. ఆ మేరకు చెల్లించడం ఇంకా పెద్ద తప్పు. ఇలా తప్పు మీద త ప్పు చేయడంతో రైల్వే శాఖ ఇమేజితో పాటు, సంస్థ సొమ్ముకు రెక్కలు వచ్చేస్తున్నాయి. ఎక్సెస్ పేమెంట్ల విలువ రూ. కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది. ఏటా కనిష్టంగా 10 కోట్ల రూపాయల నుంచి గరిష్టంగా 15 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. నగర పరిధిలోని రెండు, మూడు హాస్పిటల్స్కు జరిపిన ఎక్సెస్ పేమెంట్లలో 10-20 శాతం అదనంగా ఉన్నట్టు విజిలెన్స్ గుర్తించినట్టు సమాచారం. ఇదే జరిగితే అదనంగా జరిపిన చెల్లింపులు కోట్ల రూపాయల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.